ట్రెండింగ్
Epaper    English    தமிழ்

400 ఏళ్ల క్రితం ఔరంగజేబ్ ఇచ్చిన మాట.. 30 ఏళ్లుగా హైదరాబాదీల ఇబ్బందులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 08:13 PM

హైదరాబాద్: ఔరంగజేబ్ 400 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కారణంగా.. శేరిలింగంపల్లి పరిధిలోని గుట్టల బేగంపేట పల్లవి ఎన్‌క్లేవ్ వాసులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొఘల్ చక్రవర్తి 400 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట.. ఇప్పుడు హైదరాబాద్ వాసులను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?


చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘‘1987లో వంద మందికిపైగా ప్రజలు గుట్టల బేగంపేటలో స్థలం కొనుగోలు చేశారు. అయితే మరుసటి ఏడాది ఇది తమకు చెందిన స్థలమని వక్ఫ్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో విషయం కోర్టుకు చేరింది. ఈ స్థలం మీది అనడానికి రుజువేంటి అని కోర్టు వక్ఫ్ బోర్డును ప్రశ్నించింది. ఈ స్థలాన్ని వక్ఫ్‌కు ఔరంగజేబ్ బహూకరిస్తున్నట్లు చెప్పాడని.. ఇది కేవలం మొఘల్ చక్రవర్తి నోటి మాట అని వక్ఫ్ బోర్డ్ కోర్టుకు తెలిపింది. ఇక్కడ ఔరంగజేబ్ గుర్రాళ్ల మేత మేసేవి. నోటి మాటగా తెలపడమే సాక్ష్యమని.. అది కూడా 400 ఏళ్ల తర్వాత. మీకు జోక్‌లా అనిపిస్తుండొచ్చు. కానీ కోర్టుకు ఇదే సాక్ష్యాన్ని సమర్పించారు’’ అని బీజేపీ ఎంపీ తెలిపారు.


వక్ఫ్, ముస్లింలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. ఈ సాక్ష్యం సరిపోతుందన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇది నవ్వు తెప్పించేలా, అదే సమయంలో బాధ కలిగించేలా ఉందన్నారు. ఈ చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిందంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


రెవెన్యూ, లీగల్ డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాతే తాము గుట్టల బేగంపేట‌లో దశాబ్దాల క్రితం ప్లాట్లను కొనుగోలు చేశామని స్థానికులు చెబుతున్నారు. కానీ ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఈ స్థలం తమకు చెందుతుందని ప్రకటించిందన్నారు. పైసా పైసా కూడబెట్టి తాము ఇండ్లు కట్టుకున్నామని.. కానీ ఈ భూములపై తమకు హక్కు ఉందని వక్ఫ్ బోర్డు చెబుతోందని.. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానంలో ఉందన్నారు.


గుట్టల బేగంపేట వాసులు తమ సమస్యను బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గల్లా అరుణ దృష్టికి తీసుకెళ్లారు. వక్ఫ్ సవరణ బిల్లు కోసం ఏర్పాటు చేసిన పార్లమెంట్ సంయుక్త కమిటీని తాము కలిసేలా చొరవ తీసుకోవాలని వారు బీజేపీ ఎంపీలను కోరుతున్నారు. గుట్టల బేగంపేట‌లో 300 మంది నివాసం ఉంటుండగా.. వారిలో 200 మంది ఎగువ మధ్యతరగతికి చెందిన వారని తెలుస్తోంది. సినీ నటులు, రాజకీయ నాయకులకు కూడా ఇక్కడ స్థలాలు ఉన్నాయని తెలుస్తోంది. అనవసర వివాదాల జోలికి వెళ్లడం ఎందుకని చాలా మంది సైలెంట్‌గా ఉంటున్నారట.


వక్ఫ్ వాదన..


ఆలంగిరి మసీదు ఈద్గా, శ్మశాన వాటిక నిర్వహణ కోసం ఔరంగేజ్ ఈ స్థలాన్ని వక్ఫ్‌కు బహుమతిగా ఇచ్చాడని వక్ఫ్ బోర్డు చెబుతోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 1958 నుంచి 1960 వరకు ఈ స్థలం పట్టాదారుగా మీర్జా ఖాజిబ్ సాహెబ్ ఉన్నాడని వక్ఫ్ బోర్డు వాదిస్తోంది. అయితే రికార్డులను మార్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ భూమి మీకు చెందుతుందనడానికి బలమైన సాక్ష్యం చూపించాలని వక్ఫ్ బోర్డును న్యాయస్థానాలు కోరగా.. ఔరంగజేబ్ నోటి మాటగా బహూకరించాడని.. చట్ట ప్రకారం ఇది సరిపోతుందనే సమాధానం అటు నుంచి వచ్చింది. దీంతో దశాబ్దాలుగా సమస్య పరిష్కారం కావడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa