ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 11:34 PM

 హైదరాబాద్‌లో భయంకరమైన వర్షం కురిసింది. వరుణుడు భీకరంగా గర్జించాడు. భయంకరమైన ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన కుండపోత వాన.. నగరాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వర్షం కురియటంతో.. వర్షపు నీరు రోడ్లపై పొంగిపొర్లింది. సరిగ్గా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయం చూసుకుని వరుణుడు విరుచుకుపడటంతో.. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం అయినప్పటికీ.. ఐటీ కంపెనీలు తప్ప మిగితా ఆఫీసులన్ని పని చేస్తుండటంతో.. సరిగ్గా ఇళ్లకు వెళ్లి సమయంలోనే.. వర్షం దంచికొట్టింది. దీంతో.. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.


ఇక్కడివరకు.. హైదరాబాద్‌లో ఎప్పుడు భారీ వర్షాలు పడినా దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. రోడ్లు మొత్తం జలమయం కావటంతో.. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో.. వాహనదారులు నరకం చూడాల్సి వస్తుంది. అయితే.. ఈరోజు (సెప్టెంబర్ 21న) మాత్రం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ గుండా ప్రయాణించే వాహనదారులకు ఆ నరకం డోసు ఇంకాస్త పెరిగింది. అయితే.. దానికి ఓ కారణం భీకరంగా గర్జించిన వరుణుడు అయితే.. అదే సమయంలో ఇంటికి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కారణమయ్యారు.


అప్పుడే.. వర్షం మొదలైంది. పైనుంచి భోరున వాన కుమ్మరిస్తోంది. జూబ్లీచెక్ పోస్టు నుంచి నాగార్జున సర్కిల్ మీదుగా సికింద్రాబాద్, ఖైరతాబాద్, మెహదీపట్నం మార్గాల్లో వాహనాలు చకచకా ముందుకు కదులుతున్నాయి. అదే సమయంలో బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు వెళ్లేందుకు ఫ్లైఓవర్ నుంచి, ఇటు పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వెళ్లేందుకు నాగార్జున సర్కిల్ మీదుగా వెళ్లే వాహనాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. సరిగ్గా అప్పుడే.. ఒక్కసారిగా పోలీసులు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేశారు. పైనుంచి వర్షం దంచికొడుతుంటే.. పోలీసులు ఎందుకు ఆపారా అని వాహనదారులకు అర్థం కాలేదు.. అందులో కొందరు ధైర్యం చేసి పోలీసులను అడిగితే.. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారని తెలిపారు.


వర్షం పడుతుంది కదా.. వాహనదారుల కష్టాలు అర్థం చేసుకుని సీఎం తొందరగానే వెళ్తాడని అందరూ వర్షంలో తడుస్తూనే చూశారు. కానీ.. రేవంత్ వచ్చేందుకు మాత్రం చాలా సమయమే పట్టింది. 15 నుంచి 20 నిమిషాలకు పైగానే ఆ మార్గాల్లోని వాహనదారులంతా భారీ వర్షంలో తడుస్తూ ఉండిపోయారు. అప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ చాలా నెమ్మదిగా.. వర్షపు నీటి ప్రవహాన్ని దాటుకుంటూ వెళ్లటం గమనార్హం. సీఎం కాన్వాయ్ వెళ్లిన తర్వాత 5 నిమిషాలకు గానీ.. పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అప్పటివరకు వాళ్లంతా వర్షంలోనే తడుస్తూ ఉండిపోయారు.


ఈ సమయంలో.. కార్లు, బస్సుల్లో ఉన్న వాళ్ల పరిస్థితి ఏమో కానీ.. ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ఉన్న వారు మాత్రం నరకం చూశారు. భారీ వర్షానికి.. పిడుగులు వచ్చి తమ మీదే పడుతున్నాయా అన్నట్టుగా గర్జించిన ఉరుములతో భయపడిపోయారు. అప్పటికే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవటంతో.. వరుణుడు కూడా మరింత డోస్ పెంచటంతో.. ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు కొన్ని గంటల సమయం పట్టింది.


అయితే.. ఈ విషయంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నలు సంధిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో.. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ని ఆపొద్దని.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తనకు తెలుసని.. తానూ వాళ్లలో ఒకడినే.. తన ఒక్కడి కోసం వాహనదారులను ఇబ్బంది పెట్టటం సరికాదంటూ.. పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు మాత్రం సరిగ్గా భారీ వర్షం కురుస్తున్న సమయంలోనే.. సీఎం కాన్వాయ్ రోడ్డెక్కటం.. ఆ వర్షంలోనే వాహనదారులను సుమారు అరగంట పాటు తడిసేలా చేయటంతో పాటు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు కారణమయ్యారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు.


ఎలాగూ సమాచారం ఉంటుంది కాబట్టి.. వర్షం పడే ముందైనా.. లేదా తగ్గాక అయినా రోడ్డెక్కొచ్చు.. కానీ వర్షం పడుతుందని తెలిసి కూడా రోడ్డుపైకి వచ్చి.. ప్రోటోకాల్ పేరుతో వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి సోషల్ మీడియాలో పలువురు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరికొందరు.. అప్పుడు చెప్పిన మాటలు ఉట్టివేనా రేవంతన్నా అంటూ పెదవి విరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa