ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 11:39 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ అంశం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్ చేయటం సంచలనంగా మారింది. ఈ అంశం దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. శ్రీవారి ప్రసాదాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలుపుతున్నారనే విషయం బయటకు రావటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కేంద్రమంత్రి నడ్డా ఏపీ సీఎం చంద్రబాబును వివరణ కూడా కోరారు. పూర్తి నివేదిక సమర్పించాలన్నారు.


తాజాగా.. ఈ వివాదంపై తెలంగాణ బీజేపీ మహిళా నేత కొంపెల్ల మాధవీలత సంచలన కామెంట్స్ చేశారు. లడ్డూ వివాదంపై తీవ్రంగా స్పందించే క్రమంలో ఆమె కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యాచారం జరిగిందన్నారు. హిందువులు పవిత్రంగా స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందకే వస్తుందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన కామెంట్స్ చేశారు.


'తిరుమల తిరుపతి దేవస్థానం అంటే.. శ్రీవారి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటల్లో చెప్పలేనిది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మహా ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేయటం అంటే.. ఈ జన్మకు ఇంతకు మించిన పాపం లేదు. ఈ ప్రసాదాన్ని మేం భక్షిస్తున్నాం. జంతువులమయైపోయాం. కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని మోసం చేసిన దుర్మార్గులు ఎవరో తేలాల్సిందే. వారికి పరమేశ్వరుడు పుట్టగతులు ఇవ్వడు. హైందవుల విశ్వాసాలతో ఆడుకోవం పరిపాటి అయిపోయింది. వారికి తోచినట్లు ఆడుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి.


శ్రీవారి బంగారం, నగలు మాయమైపోయాయి. రాజుల కాలం నుంచి శ్రీవారికి సమర్పించిన ఆభరణాల లెక్కలు ఎవరికీ తెలియదు. దేవాలయంలోని హుండీ డబ్బులు ఎగిరిపోతున్నాయి. ఏడు కొండలను జప్తు చేయాలని చూస్తున్నారు. ఆయన కలియుగ దైవం. ఇది అన్యాయం, లడ్డూను కల్తీ చేయటం అంటే అత్యాచారం అన్నట్లే. డబ్బు తింటే రాక్షసులనుకోవచ్చు. దుర్మార్గంగా జంతుకొవ్వుతో ప్రసాదం చేసి స్వామి వారికి ప్రసాదం పెడతారా..? ఈ పాపం ఊరికేపోదు. ఇప్పటికైనా కేంద్రాన్ని కోరేది ఒక్కటే. ప్రసాదం అంశంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి. ఈ ప్రసాదం ఆయోధ్యకు కూడా వెళ్తుంది. మనకు ఈ కర్మ ఏంటి. దీనిపై రాజకీయం చేయకుండా నిజాలు బయటకు రావాలి. ఇందులో నిజాలు బయటకు వచ్చే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటా.' అని మాధవీలత అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa