ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 08:49 PM

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే ఈ హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూపాయి రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇండ్లను ఏమాత్రం కనికరం లేకుండా కూల్చేస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు.


తాజాగా.. (సెప్టెంబర్ 22న) అమీన్ పూర్ మున్సిపాలిటిలోని పటేల్‌గూడలో పలు నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే ఇండ్లు కోల్పోయిన బాధితుల కథ వింటే గుండె తరుక్కుపోతోంది. ఒక్కొక్కరిది ఒక్కోగాథ. రిజిస్ట్రేషన్ అయిన మూడు రోజులకే తన ఇంటిని నేలమట్టం చేశారంటూ ఓ కుటుంబం కన్నీరు పెట్టుకుంటే.. గృహ ప్రవేశం చేసి మామిడాకుల తోరణాలు ఆరకముందే ఇంటిని కూల్చేశారని మరో బాధితుడు భావోద్వేగానికి గురయ్యాడు. అన్ని కరెక్ట్ గా ఉన్నా ఎందుకు కూల్చారని ప్రశ్నిస్తున్నారు. వాళ్లే రిజిస్ట్రేషన్ చేస్తారు.. వాళ్లే కూల్చేస్తారు.. ఇదెక్కడి న్యాయమంటూ బాధితులు బోరుమంటున్నారు. అలా ఇల్లు కోల్పోయిన ఓ బాధితుడి ఆవేదన ఆయన మాటల్లోనే..


'3 సంవత్సరాలు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కొన్నాం. మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఈ సిస్టం కరెక్ట్ కాదు. ప్రభుత్వ ల్యాండ్ అంటున్నారు.. అమ్మితే మేమే కొంటాం కదా.. కూల్చేస్తే ఏమెుస్తది. ఇది స్మశానంలా తయారయింది. ఆ తర్వాత రాష్ట్రానికి బడ్జెట్ లేదని మీరే అమ్మేస్తారు. అదేదో మేమే ఇస్తాం కదా. గవర్నమెంట్ వాళ్లే అన్ని పర్మిషన్లు ఇచ్చారు. గత మూడేళ్లుగా కష్టపడి కొనుక్కున్నాం. ఇంకా 70-80 లక్షల అప్పుంది. ఆ అప్పును ఎలా తీర్చాలి. గ్రామ పంచాయితీ నుంచి పర్మిషన్ తీసుకున్నాం. లోన్ కూడా వచ్చింది. అన్నీ బానే ఉన్నాయ్ కదా అని కొన్నాం. గత సోమవారమే గృహ ప్రవేశం అయింది. మామిడాకుల తోరణాలు కూడా ఆరలేదు. నివాస గృహాలు కూల్చొద్దని సీఎం రేవంత్ చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో అలా లేదు.


మేం సామాన్యులం. 90 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కొన్నాం. కూలగొట్టే బదులు వాళ్లే తీసుకొని మాకు అమ్మొచ్చు కదా. హైదరాబాద్‌లో ఇల్లు ఉండాలని పిచ్చి టార్గెట్‌తో ఇల్లు కొన్నాం. నాకు 52 ఏళ్లు. నా సంపాదన అంతా ఇందులోనే పోశా. ఇప్పుడు ఏం లేదు. క్వశ్చన్ మార్క్ ఉంది. నాకు ఏ దారి కనిపించటం లేదు. మేం సాదాసీదా మనుషులం. డాక్యుమెంట్లు, పర్మిషన్లు చూసుకున్నాం. అన్నీ ఉన్నాయి కదా అని కొన్నాం. వాళ్లే రిజిస్ట్రేషన్ చేసి వాళ్లే కూల్చేస్తున్నరు. మాకు నష్టపరిహారం కావాలి. ఇది ఎవరి తప్పు. మేం కబ్జాలు చేయలేదు. అన్నీ సవ్యంగా ఉన్నాయి కదా అని కొన్నాం. ఈ మనోవేదన తట్టుకోలేకపోతున్నాం.' అని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa