ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 11:31 PM

తెలంగాణలోని ట్రాన్స్ జెండర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్‌లు వినిపిస్తోంది. సమాజంలో ట్రాన్స్ జెండర్లు కూడా అందరిగా గౌరవప్రదంగా జీవించేందుకు వీలుగా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు.. వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించేందుకు మైత్రి క్లినిక్ పేరుతో.. ప్రత్యేక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.


సాధారణంగానే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మహిళలు, పురుషుల కోసం వైద్య సేవలు అందిస్తుంటారు. అయితే.. ట్రాన్స్ జెండర్లు.. మాత్రం తమకు వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్యం చేయించుకునేందుకు గానీ.. వారికి వైద్యం చేసేందుకు వైద్యులు గానీ.. సంశయిస్తుంటారు. అలాంటి ఇబ్బంది ఉండకూడదని భావించిన ప్రభుత్వం.. ట్రాన్స్ జెండర్ల కోసం మైత్రి క్లినిక్ పేరుతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో ఈ మైత్రి క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ఇందులో భాగంగానే సూర్యాపేట, యాదాద్రి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. మైత్రి క్లినిక్ ఏర్పాటు చేశారు. ఇందులో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక వార్డు, ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మైత్రి క్లినిక్‌లలో వారంలో 2 రోజులు ఓపీ సేవలందించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు అందిస్తారు. ఒకవేళ క్లినిక్‌కు వచ్చే పేషంట్ల సంఖ్య పెరిగితే.. దాన్ని బట్టి ఓపీ సేవలు అందించే రోజుల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు.


అంతే కాకుండా.. ఈ మైత్రి క్లినిక్‌లో సేవలందించేందుకు గానూ.. ప్రత్యేకంగా వైద్యులను నియమిస్తున్నారు. మొత్తం ఐదుగురు డాక్టర్లను నియమించటమే కాకుండా వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇందులో గైనకాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, మానసిక వైద్యుడు, జనరల్ ఫిజిషియన్‌తో పాటు ఓ నర్సు కూడా ఉంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులోనే.. ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. వైద్యులు రాసిచ్చే మందులను తీసుకునేందుకు కూడా ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.


రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హాయాంలోనూ ట్రాన్స్ జెండర్ల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక క్లినిక్‌కు పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే.. ఉస్మానియా ఆస్పత్రితో పాటు వరంగల్ ఆస్పత్రిలో క్లినిక్‌లు ఏర్పాటు చేసి.. వైద్య సేవలు అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa