ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నదాతకు తీపి కబురు.. దసరా నుంచే, సిద్ధమైన రేవంత్ సర్కార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 07:01 PM

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేశారు. తాజాగా.. సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ రెడీ అయింది. దసరా నుంచి జనవరి నెలాఖరు వరకు దాదాపు నాలుగు నెలల పాటు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సన్నరకాల వరిసాగును ప్రోత్సహించేందుకు ఈ సీజన్‌ నుంచి క్వింటాకు రూ. 500 బోనస్‌ ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వడ్ల కోనుగోళ్ల సమయంలో బోనస్ ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌ రెడ్డితో ఇటీవల జరిగిన సమావేశంలో వడ్ల కొనుగోళ్లకు సంబంధించిన కార్యాచరణను పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించారు.


ముందస్తుగా వరి పంట దిగుబడి వచ్చే కొన్ని జిల్లాల్లో ఈ సీజన్ వరి కోతలు కొంత ఆలస్యం అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలే అందుకు కారణంగా తెలిపారు. ఈ నేపథ్యంలో దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. జిల్లాలు, నెలలవారీగా ధాన్యం కొనుగోళ్ల ప్రణాళికను ఇప్పటికే రూపొందించారు. వర్షాలకు ధాన్యం తడిచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్ష సూచనల్ని ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అందించేలా పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ధాన్యం బస్తాలు తడవకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నదాతలు సైతం వానకు తడవకుండా ఆయా కొనుగోలు కేంద్రాల్లో చిన్నపాటి షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రాలకు నవంబరు, డిసెంబరు మాసాల్లో భారీ ఎత్తున ధాన్యం వస్తుందని పౌరసరఫరాల అంచనా వేస్తోంది.


అక్టోబరు తొలి వారం ఆఖరులో నల్గొండ, మెదక్‌ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండో వారంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాలు. మూడో వారంలో జనగామ, సూర్యాపేట, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, మేడ్చల్‌ జిల్లాలు నాలుగో వారంలో పెద్దపల్లి, హనుమకొండ, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాల్లో వరి కోతలు మొదలవుతాయని భావిస్తున్నారు.


ఇక నవంబరు నెల తొలి వారంలో రంగారెడ్డి, నిర్మల్, సిద్దిపేట, రెండో వారంలో వనపర్తి, గద్వాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, మూడో వారంలో ములుగు, ఖమ్మం, భూపాలపల్లి, నాలుగో వారంలో వికారాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలో ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa