ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్లు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఎవరి భూములూ పోలేదా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ పేరుతో అక్కడి రైతులను బలవంతంగా ఖాళీ చేయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా.. అని రేవంత్ రెడ్డి నిలదీశారు. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వండని ప్రతిపక్ష నేతలను అడిగారు సీఎం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యకరమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన 1635 మంది నియామక పత్రాలు అందజేశారు. ఈ క్రమంలోనే.. మూసీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
నదుల పేర్లను చాల మంది తమ పిల్లలకు పెట్టుకుంటారని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. గంగ, యమున, గోదావరి, కావేరి లాంటి చాలా నదులు పేర్లు తమ కుమార్తెలకు పెట్టుకుంటారని తెలిపారు. కానీ.. ఏ తండ్రి అయినా తమ కుమార్తెకు మూసీ నది పేరును పెట్టుకున్నారా అంటూ నిలదీశారు. మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిందని చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును పూర్తి చేసి.. దేశానికే ఆదర్శంగా నిలబెడతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మరోవైపు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏళ్ల కొద్దీ సాగదీసిందంటూ రేవంత్ రెడ్డు దుయ్యబట్టారు. నియమకాల ప్రక్రియను నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్ల పాటు నిలిచిపోయేలా చేశారని మండిపడ్డారు. మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలన్న ఆలోచనతో గతంలో తాను చేపట్టిన "విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్"కు యువత మద్దతిచ్చినట్టు గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆరోజు చెప్పానని.. తాను చెప్పినట్టే కేసీఆర్ ఉద్యోగం పోయిందని.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాలు జరగక.. ఉపాధి అవకాశాలు లేక.. లక్షలాది మంది యువకులు నిరాశ చెందారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సంవత్సరాలుగా వాయిదా పడుతోన్న ప్రభుత్వ ఉద్యోగాలకు పరిష్కారం చూపించిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసేలా చేశామన్నారు. ఈనెల 9న సాయంత్రం 4 గంటలకు ఎల్బీస్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
వందేళ్ల అనుభవం ఒకవైపు ఉంటే.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందరం నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa