తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ దీపావళి కానుక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని పేద ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై మంత్రి తీపికబురు వినిపించారు. అక్టోబర్ నెలాఖరులోగా.. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ కలెక్టరేట్ గోషామహల్ నియోజకవర్గంలోని లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, గణేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో కలిసి మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. మొత్తం.. 144 మంది లబ్దిదారులకు మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గురించి చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. పార్టీలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. లక్షా 50 వేల ఇండ్లకు టెండర్లు పిలిచామని.. 98 వేల ఇండ్లు కట్టామని, 40 వేల ఇండ్లు ఇప్పటికే పంపిణీ చేశామని.. ఇంకా 58 వేలు పంపిణీ చేయాల్సివుందని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్.. వాటిని కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే వాడుకుందని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలకులు డబుల్ బెడ్ రూం ఇండ్లలోనైనా, ఉద్యోగాల్లోనైనా, ప్రాజెక్టుల్లోనైనా కేవలం రాజకీయ అర్భాటాన్ని ప్రదర్శించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం అసంపూర్తిగా వదివేసిన ఇండ్లను పూర్తి చేయించడంతో పాటు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నప్పటికీ.. పేదలను ఆదుకోవటం కోసం అమలు చేస్తున్న పథకాల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడటం లేదని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... దీపావళి పండగను కొత్త ఇంట్లో జరుపుకునేలా పండగకు ముందే ఇళ్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. రాంపల్లి డబుల్ బెడ్ రూం ఇండ్లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇండ్లను, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa