ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే హృదయవిదారక ఘటన.. ఇలాంటి మనుషుల మధ్య ఉన్నామా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2024, 07:47 PM

హైదరాబాద్ నాగోలు డివిజన్ పరిధిలోని జైపురి కాలనీ బ్లైండ్స్ కాలనీలో రెండ్రోజుల క్రితం విషాదకర ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కొడుకు మృతి చెందిన విషయం తెలియని అంధ వృద్ధ దంపతులు మూడ్రోజుల పాటు శవంతోనే గడిపారు. రమణ, శాంతకుమారి అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు ప్రదీప్ తన కుటుంబంతో సహా నగరంలోనే మరోచోట ఉంటున్నాడు. చిన్న కుమారుడు ప్రమోద్ మాత్రం తల్లిదండ్రుల వద్దే ఉంటూ వారి బాగోగులు చూసేవాడు.


అయితే భార్య వదిలేసి వెళ్లిపోవటంతో మద్యానికి బానిసైన ప్రమోద్.. గత వారం క్రితం ప్రాణాలు కోల్పోయాడు. విపరీతంగా మద్యం సేవించటంతో ఆరోగ్యం క్షీణించి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తమ కుమారుడు చనిపోయినన విషయం తెలియని అంధ వృద్ధ దంపతులు మూడ్రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయారు. కుమారుడిని పిలిచినా పలకకపోవటం, వారికి చూపు లేకపోవటం, తినటానికి తిండి లేకపోవటంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అలాగే ఉండిపోయారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారి వచ్చి చూసేసరికి కుళ్లిన మృతదేహం కనిపించింది.


ఆకలితో వృద్ధ దంపతులు అలమటిస్తున్నారు. మానవత్వం చాటుకున్న పోలీసులు వారికి స్నానం చేయించి భోజనం పెట్టించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ విషయంపై టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాయమవుతున్న మనిషితత్వానికి ఇది మాయని మచ్చ అని అన్నారు. నాలుగు రోజులు తిండి నీళ్లు లేకుండా ఆకలికి అలమటించిన ఆ వృద్ద దంపతులకు కాదు చూపులేనిది, మ‌న‌కే, మన సమజానికే. అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.


'కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే హృదయవిదారక సంఘటన! హృదయం కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్న హేయమైన ఘటన ఇది. మాయమవుతున్న మనిషితత్వానికి మాయని మచ్చ ఇది. ఇలాంటి మనుషుల మధ్యన మనం కూడా మనుగడ సాగిస్తున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. అంగారక గ్రహం మీద కూడా అడుగు పెట్టాల‌నుకుంటున్న మనిషి.. ప‌క్క మ‌నిషి బాధల్లోకి, మ‌నుసుల్లోకి తొంగి చూడ‌లేక‌పోవ‌డం బాధాక‌రం. ఎక్కడికి ఈ ప‌రుగు.. ఎక్కడికి ఈ గమ్యంలేని ప‌య‌నం. నాలుగు రోజులు తిండి నీళ్లు లేకుండా ఆకలికి అలమటించిన ఆ వృద్ద దంపతులకు కాదు చూపులేనిది, మ‌న‌కే, మన సమజానికే. మనిషి స్పందించు!' అని సజ్జనార్ భారమైన హృదయంతో ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa