హైదరాబాద్ టు శ్రీశైలం బిజీ హైవే.. ప్రతి రోజూ వాహనాలతో రద్దీగా ఉండటంతో రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్-శ్రీశైలం హైవేలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ విస్తరణ కోసం 147.31 హెక్టార్ల భూసేకరణ అవసరమని అంచనాలు సిద్ధం చేశారు అధికారులు. ఈ హైవే విస్తరణ ప్రాజెక్ట్ నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్ టైగర్రిజర్వు మీదుగా వెళుతోంది. ఈ క్రమంలో అనుమతుల కోసం రాష్ట్ర అటవీశాఖతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సమావేశం అయ్యారు. ఈ ప్రాజెక్టు గురించి వివరించి.. నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అటవీ భూమి కావాలని అటవీశాఖ అధికారుల్ని కోరారు.
జాతీయ రహదారి-756లో హైదరాబాద్-శ్రీశైలం సెక్షన్ మధ్య పెరిగి ట్రాఫిక్.. భవిష్యత్లో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం 2 వరుసల ఉన్న ఈ రోడ్డును 4 లేన్లుగా విస్తరించే ప్రణాళిక చేపట్టామని అటవీశాఖ అధికారులకు వివరించారు. ఈ హైవే విస్తరణలో భాగంగా.. వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అవి తిరిగే ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ దాదాపు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తామని చెప్పారు. మిగిలిన చోట్ల రోడ్డును విస్తరిస్తామని వివరించి చెప్పారు. హైదరాబాద్-శ్రీశైలం హైవేలో 128.6 కి.మీ. నుంచి 191 కి.మీ. వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు అధికారులు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి పాతాళగంగ (అయితే పాతాళగంగ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది) వరకు తెలంగాణ పరిధిలో నేషనల్ హైవేను విస్తరిస్తారు. తెలంగాణలో 62.5 కి.మీ. మేర హైవేను విస్తరించాలని నిర్ణయించారు.. ఇందులో 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని చెబుతున్నారు అధికారులు. ఈ ప్రతిపాదనలకు అటవీ అధికారులు కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఈ హైవే కోసం ఎక్కువ చెట్లను నరక్కుండా.. ప్రణాళికలో కొన్ని మార్పుల్ని సూచించినట్లు సమాచారం.
అలాగే ఈ హైవేలో మన్ననూరు చెక్పోస్టు నుంచి దోమలపెంట చెక్పోస్టు మధ్యలో రాత్రి వేళల్లో కొన్ని నిబంధనల్ని అమలు చేస్తున్నారు. అటవీశాఖ రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల్ని అనుమతించడం లేదు. పులులు, ఇతర వన్యప్రాణులు రాత్రివేళలో తిరుగుతుంటాయి కాబట్టి.. ఈ నిబంధన అమలుచేస్తున్నారు. అయితే ఈ హైవేను విస్తరించిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు కొనసాగుతాయని అటవీశాఖ అధికారులకు వివరించగా.. ఫ్లైఓవర్ మధయంలో వాహనాలు ఎక్కి, దిగేలా ర్యాంపులు నిర్మించొద్దని అటవీశాఖ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వాహనాల లైటింగ్ ఎక్కువగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని.. ఎలివేటెడ్ కారిడార్పై రాత్రివేళ తక్కువ లైటింగ్ పెట్టాలని కూడా సూచించారట. ఈ మేరకు నేషనల్ వైల్డ్లైఫ్ బోర్డు మార్గదర్శకాలను పాటించాలని చెప్పారట. మొత్తం మీద హైదరాబాద్-శ్రీశైలం హైవే విస్తరణకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. అన్ని అనుమతులు రాగానే.. భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa