పట్టపగలు.. అది కూడా శ్మశానం.. చుట్టూ సమాధులు.. అయినా వాళ్లకు అదంతా ఏమీ పట్టలేదు. వాళ్లున్నది శ్మశానమే అయినా.. స్వర్గంలో తేలియాడుతున్న అనుభూతి పొందుతున్నారు. వాళ్లు కూర్చుంది ఓ చలువారాతి సమాధిపైనే అయినా.. పూలపాన్పు మీదున్నట్టే ఫీలవుతున్నారు. చుట్టూ సమాధులున్నా.. ఎవరైనా చూస్తారేమో అన్న భయాలు ఏమాత్రం వాళ్లకు లేవు.. ఎంచక్కా ఇద్దరూ ఓ సమాధిపై కూర్చొని తమ పని తాము కానిచ్చేస్తున్నారు. అదేనండి గంజాయి కొడుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట శ్మశానంలో పట్టపగలే చోటుచేసుకుంది. ఓ ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు.. శ్మశానంలో ఓ సమాధిపై కూర్చొని గంజాయి సేవిస్తూ కనిపించారు.
ఇద్దరు యువకులు శ్మశానంలో ఓ సమాధిపై కూర్చొని ఉండటాన్ని.. పక్కనే ఉన్న ఓ ప్రైవేటు కార్యాలయంలోని ఉద్యోగులు గమనించారు. పొద్దుపొద్దున్నే ఆ యువకులు అక్కడ ఏం చేస్తున్నారని తీక్షణంగా వీక్షిస్తే గానీ అసలు విషయం అర్థంకాలేదు. వెంటనే మొబైల్ తీసి వీడియో తీశారు. అయితే.. ఆ యువకులు పంజాగుట్ట పరిసరాల్లో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన విద్యార్థులుగా తెలుస్తోంది. ఎక్కడ గంజాయి తాగినా దొరికిపోతామనుకున్నారో.. ఇదే సేఫ్ ప్లేస్ అనుకున్నారో.. ఎవరూ ఊహించని ప్రదేశమైన శ్మశానంలోనే పని కానిచ్చేశారు. కాలేజీ విద్యార్థులు పట్టపగలే ఇలా గంజాయి సేవించటం.. అది కూడా శ్శశానంలో.. ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేకుండా సేవిస్తుండటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే.. తెలంగాణలో యువత పక్కదారి పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రతీ వేదికపై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సరైన లక్ష్యం లేకనో.. మార్గనిర్దేశం చేసే వారులేక పోవటమో.. చెడు సావాసాల వల్లో.. ఏం చేసినా చెల్లుతుందన్న లెక్కలేనితనమో.. కారణమేదైనా.. కొంతమంది యువకులు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని.. గంజాయి, డ్రగ్స్, మద్యం లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి చిత్తవుతున్నారని బాధ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కేవలం మాదకద్రవ్యాలకు బానిసలవటమే కాకుండా మత్తులో నేరాలకు పాల్పడుతూ.. భవిష్యత్తును పాడు చేసుకుంటున్న ఘటనలు ఇప్పటికే చాలా వెలుగుచూశాయి. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తూ.. వారిని వాటి నుంచి దూరం చేసేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సీటీగా మార్చటమే లక్ష్యంగా రకరకాల చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్లో ఎక్కువగా.. విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యంగా.. డ్రగ్స్, గంజాయి సరఫరా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు.. ప్రత్యేకంగా నార్కొటిక్ వింగ్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ మత్తు రక్కసి నుంచి యువతను రక్షించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. పోలీసులు ఎన్ని డేగ కళ్లతో నిఘా పెట్టినా.. మాదకద్రవ్యాల సరఫరా మాత్రం చాప కింద నీరులా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న చిన్న క్లూ దొరికినా.. పబ్బులు, ఫామ్ హౌసులే కాదు.. కిరాణా దుకాణాలు, పాన్ షాపులు ఇలా దేన్నీ వదలకుండా దాడులు చేస్తూ.. నిఘా పెడుతున్నారు. అయినా సరే.. గంజాయి బ్యాచ్ మాత్రం పోలీసులు కళ్లుగప్పి బరితెగించి.. ఇలా మత్తులో జోగుతుండటం శోచనీయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa