ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌‌వాసులకు హెచ్చరిక.. రోడ్డుపై చెత్త వేశారో బుక్కైపోతారు జాగ్రత్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2024, 07:41 PM

హైదరాబాద్‌వాసులకు ముఖ్యగమనిక.. రోడ్డుపై చెత్త వేస్తే అడ్డంగా దొరికిపోతారు. జీహెచ్ఎంసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.. ఇకపై నిఘా మరింత పెరగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్‌ జోన్‌లోని ఉప్పల్‌ సర్కిల్‌‌లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీసీ కెమెరా, మైకును అమర్చిన నిఘా వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రారంభించారు.


 ఈ వాహనాలు రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించి.. వారి ఫొటో తీస్తుంది. రోడ్లపై చెత్త వేస్తూ ఆ వాహనంలో ఉన్న కెమెరా కంటికి చిక్కగానే మైకు మోగుతుంది. రోడ్లపై చెత్త వేయకూడదు.. చేసిన తప్పునకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ప్రకటన కూడా వస్తుంది. వెంటనే జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఉల్లంఘనులకు జరిమానా కూడా విధిస్తారు. తద్వారా ప్రజల్లో మార్పు వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ వాహనాల ద్వారా రోడ్లపై చెత్త వేసేవారిని గుర్తించేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు. నగరవాసులు రోడ్లపై చెత్త వేయకుండా తమ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.


మరోవైపు హైదరాబాద్‌లో పారిశుద్ధ్య విభాగాన్ని గాడిలో పెట్టే పనిలో ఉంది జీహెచ్‌ఎంసీ. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంటింటి చెత్త సేకరణపై ఫోకస్ పెట్టింది. కొన్ని డివిజన్లలో రెండు, మూడు రోజులకు గానీ స్వచ్ఛ ఆటోలు చెత్తను తీసుకుపోవట్లేదని జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ అంశంపై ఫోకస్ పెట్టారు. దీని కోసం ప్రత్యేకంగా ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్) పేరుతో నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధ్యయనం చేసి కంట్రోల్‌ రూము, మొబైల్‌యాప్‌ను ఏర్పాటు చేయనున్నారు.


జీహెచ్‌ఎంసీ ప్రధానంగా చెత్త సేకరణకు సంబంధించి సమస్యలపై అధ్యయనం చేస్తోంది. రోజూ చెత్తను సేకరిస్తే వీధుల్లో చెత్త కుప్పలు ఉండవు. ఎక్కువమంది స్వచ్ఛ ఆటోల డ్రైవర్లు రోజూ చెత్త సేకరణకు వెళ్లట్లేదని గుర్తించారు. అందుకే ఆటో కార్మికులకు చెత్త సేకరణలో ఎదురవుతోన్న సమస్యలు, వారి వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీస్తున్నారు. ఇళ్లలో చెత్త సేకరణ సరే.. వ్యాపార కేంద్రాల్లో, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఉత్పత్తయ్యే చెత్తను ఏం చేయాలి వంటి అంశాలపై జీహెచ్‌ఎంసీ అధ్యయనం చేస్తోంది. ప్రతి ఆటోకు కొన్ని రోడ్లను కేటాయించి.. ప్రతి రోజూ ఇళ్లకు రోజూ వెళ్తున్నారా, లేదా గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని స్వచ్ఛ ఆటోలకు జీపీఎస్‌ పరికరాలను అమర్చగా.. మిగిలిన వాటికి కూడా జీపీఎస్ పెట్టి.. ఐసీసీసీ, మొబైల్‌ యాప్‌ ద్వారా వాటిపై నిఘా ఉంచాలని నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa