భూదాన్ భూముల విషయంలో రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమోయ్ కుమార్ వ్యవహరించిన తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రైబ్యునల్ అథారిటీ హోదాలో ధ్రువీకరించిన అధికారే... జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంపై విస్తుపోయింది. రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు మీడియాలో కథనాలు చూశామని.. నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆనాడు భూములను దివానీ, సర్ఫేకాజ్, పట్టాలు అనే మూడు విభాగాలుగా గుర్తించిన నిజాంను అభినందించాలని పేర్కొంది.
ఆరోపణలు ఎదుర్కొన్నన్నప్పుడు అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనంటూ గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు ప్రస్తావించింది. భూదాన్ భూముల రక్షణ కోసం అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను వితరణ చేస్తే... గతంలో ఉన్న భూదాన్ బోర్డుతోసహా అధికారులు వాటిని స్వాహా చేశారని వ్యాఖ్యానించింది. తెలంగాణలో పేదలకు భూములను ఇచ్చిన ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారని, అగ్రికల్చరల్ సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 500 ఎకరాలు ఇచ్చేశారని తెలిపింది.
భూదాన్ భూముల రక్షణలో గత బోర్డు సహా అధికారులు విఫలమయ్యారని మండిపడింది. ప్రస్తుత కేసులో 10 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని ధ్రువీకరించిన తర్వాత వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారు? అని ప్రశ్నించింది. దీనిపై కౌంటరు దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూదాన్ యజ్ఞబోర్డు, వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్ డి.అమోయ్కుమార్, అప్పటి డీఆర్వో ఆర్పీ జ్యోతితోపాటు మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.
కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలకు సంబంధించి ఖాదర్ ఉన్నీసా బేగమ్కు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని నవాబ్ ఫరూక్ అలీఖాన్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ గతంలో వీటిని భూదాన్ భూములుగా ఆర్డీవో ఉత్తర్వులు ఇస్తే, స్పెషల్ ట్రైబ్యునల్ సమర్థించిందని తెలిపారు. దీనికి విరుద్ధంగా అప్పట్లో ట్రైబ్యునల్కు నేతృత్వం వహించిన అధికారి.. కలెక్టర్ హోదాలో ఖాదర్ ఉన్నీసా బేగం పెట్టుకున్న అర్జీని ఆమోదించి పట్టాదారు పాస్బుక్ జారీ చేశారని వివరించారు.
అంతేకాదు, భూదాన్ భూములకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ హైకోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోలేదని వివరించారు. ఈ వాదనలను విన్న జస్టిస్ భాస్కరరెడ్డి.. భూములకు సంబంధించి వివాదం పెండింగ్లో ఉన్నప్పటికీ ఆలోచించకుండా పట్టాదారు పాస్ బుక్ జారీ చేయడం ఏంటి? అని విస్తుపోయారు. ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 28కి వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa