ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాదీలకు తీపికబురు.. మెట్రో రెండో దశ పనులు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 07:09 PM

హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ రెండో దశ నిర్మాణ పనుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ వేగం పెంచింది. ఇందులో భాగంగానే కీలక ముందడుగు పడింది. మెట్రో రెండో దశలో భాగంగా.. ఓల్డ్ సిటీ మెట్రో రైల్ రూట్‌ కోసం భూసేకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కావాల్సిన ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో.. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణానికి ఆస్తులు సేకరించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా.. హైద్రాబాద్ మెట్రో రైలు అధికారులు భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు.


సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెట్రో ఫేజ్-2లో ఆరో కారిడార్‌లో భాగంగా.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మొత్తంగా 200 ఆస్తులకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. ఆస్తుల సేకరణ కోసం డిక్లరేషన్‌కు ఈరోజు(నవంబర్ 16న) జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి ఆమోదం తెలిపారు. దీంతో.. ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్‌కు రెండువైపుల 100 చొప్పున మొత్తం 200 ఆస్తుల సేకరణకు అధికారులు ముందడుగు వేశారు. ఆస్తుల సేకరణ పూర్తి అయితే.. కొత్త సంవత్సరం జనవరిలో మెట్రో రైలు రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ అనుదీప్ వివరించారు.


మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు మొత్తం అంచనా వ్యయం రూ. 24,269 కోట్లు కాగా.. అందులో 30 శాతం అంటే రూ.7313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం.. 18 శాతం అంటే రూ. 4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకునేలా రేవంత్ రెడ్డి సర్కార్ డీపీఆర్ సిద్ధం చేసి ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.


రెండో దశలో మొత్తం 76.4 కిలో మీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనుండగా.. దానికి రూ.24,269 కోట్లు కేటాయిస్తూ జీవో 196 పేరుతో ఇప్పటికే సర్కారు పరిపాలన అనుమతుల ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశలో ప్రభుత్వం కొత్తగా 5 కారిడార్‌లు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. నాలుగో కారిడార్ నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 36.8 కిలో మీటర్లు.. ఐదో కారిడార్ రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు 11.6 కిలో మీటర్లు.. ఆరో కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు.. ఏడో కారిడార్ మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కిలో మీటర్లు.. ఎనిమిదో కారిడార్ ఎల్‌బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించ తలపెట్టింది ప్రభుత్వం. కాగా.. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ మెట్రో రైలు కూడా అందుబాటులోకి వస్తే నగరంలో రోజుకు మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa