ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో గీత కార్మికులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా మోపెడ్ వాహనాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 07:22 PM

తెలంగాణలోని గీత కార్మికులు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటికే కల్లు గీత కార్మికుల రక్షణ కోసం.. కాటమయ్య రక్షక కవచాలను సర్కార్ పంపిణీ చేస్తుండగా ఇప్పుడు వారి కోసం మరో తీపికబురు వినిపించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. శనివారం (నవంబర్ 16న) రోజున హుస్నాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో.. గీత కార్మికులకు.. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షక కవచాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికులు చనిపోకుండా ఉండేందుకు.. ఐఐటీ విద్యార్థులు రక్షక కవచాన్ని తయారు చేయగా వాటిని కాటమయ్య రక్షక కవచం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ పంపిణీ చేస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు.


ఈ కిట్‌పై క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చే విషయంలో ఎక్కడా జాప్యం జరగకూడదని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు ఎమ్మెల్యే నిధులు, పార్లమెంటు సభ్యుని నిధులను కూడా వెచ్చించి పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. గీత కార్మికులు వృత్తిలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ.. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని మంత్రి ఆకాంక్షించారు. తాటి చెట్లు ఎత్తుగా ఉండటం వల్ల అసౌకర్యంగా ఉండడం మాట వాస్తవమేనని.. అందుకోసం చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా పరిశోధనలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.


అయితే.. కాలువలు, చెరువు గట్లపైనా, రోడ్ల పక్కన ఇతర ప్రాంతాల్లో నాటే చెట్లల్లో 50 శాతం తాటి, ఈత చెట్లను నాటాలని మంత్రి పొన్నం తెలిపారు. జన్మదిన సందర్భాలు, శుభకార్యాల సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటి తమ బాధ్యతను చాటుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి గానూ స్థలం ఉంటే బోర్లు వేయించే బాధ్యత కూడా తీసుకుంటానని మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే.. గీత కార్మికులకు సంబంధించి ఏమైనా పాత బకాయిలు ఉన్నట్లయితే విడుదలయ్యేలా చూస్తానని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.


అయితే.. తాటి, ఈత వనాలకు వెళ్లేందుకు, వచ్చేందుకు ఇబ్బందవుతుందని.. ఈ కార్యక్రమంలో ఓ గీత కార్మికుడు తమ సమస్యల గురించి మంత్రికి తెలియజేయగా.. కీలక ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగ్గా లేవని.. 2025 మార్చి తర్వాత గీత కార్మికులకు మోపెడ్ వాహనాలు అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. గీత కార్మికులందరూ ప్రభుత్వం ఇచ్చే ఫలాలను సక్రమంగా సద్వినియోగం చేసుకొని ప్రాణాలు రక్షించుకుని.. మెరుగైన జీవితాలను అనుభవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa