ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడుతున్న యువత సర్వం కోల్పోతున్న సంగతి తెలిసిందే. లక్షలకు లక్షలు బెట్టింగులు పెడుతున్న కొందరు డబ్బులు పోగొట్టుకోవటమే కాదు.. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే ఈజీగా లక్షలకు లక్షలు సంపాదించాలనే దురశాతో ఆన్లైన్ బెట్టింగులకు అలవాటుపడి చిత్తవుతున్నారు. కొందరు సోషలో మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ.. అమాయకులు ఆ ఉచ్చులో చిక్కుకునేలా ప్రలోభపెడుతున్నారు.
అటువంటి వీడియోనే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఓ యువకుడు తక్కువ సమయంలోనే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చంనంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. ప్రజలు నమ్మే విధంగా గది నిండా రూ.500 నోట్లు వెదజల్లటంతో పాటుగా తన ఖరీదైన ఐఫోన్ను లైవ్లో పగులగొట్టి ఆ ఫోన్ కొనేందుకు కావాల్సిన డబ్బు క్షణాల్లో సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఓ బెట్టింగ్ యాప్లో 20 వేలు పెట్టుబడి పెట్టి కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షలు సంపాదిస్తాడు. ఈ వీడియోను తన ఇన్స్ట్ పేజీలో షేర్ చేస్తాడు.
ఈ వీడియో వైరల్ కాగా.. సజ్జనార్ స్పందించారు. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు అని ట్వీట్ చేశారు. 'ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు. తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యవసనపరులను చేస్తూ.. వారి ప్రాణాలను తీస్తోన్న వీళ్లంతా సంఘవిద్రోహ శక్తులే. యువకుల్లారా!! ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయమాటల్లో పడకండి!! బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు. మీ కష్టాన్ని నమ్ముకోండి. విజయం దానంతట అదే మీ దరికి చేరుతుంది.' అని ట్వీట్ చేశారు. కాగా,సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సజ్జనార్ తరుచూ ఇటువంటి వీడియోలు షేర్ చూస్తూ ఉంటారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వాటి ఉచ్చులో చిక్కుకొని నిలువు దోపిడీకి గురికావొద్దని హెచ్చరిస్తూ ఉంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa