ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేవంత్‌ పై హరీష్‌రావు ధ్వజం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 02:10 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరపాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శలు చేశారు.అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్‌గా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఎద్దేవా చేశారు.సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్లారని ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.''ఎవరనుకున్నారు ఇట్లవున్నానని.. ఎవరునుకున్నారు ఇట్లవున్నానని' ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారు. రైతులు దారుణంగా మోసపోయారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు. ఏం సాధించారని సంబురాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు ఏడాది అయినా అతీగతీ లేదు. డిక్లరేషన్‌లో చెప్పిన మొట్ట మొదటి హామీ రూ. 2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదు. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తాన్న రూ.12వేలు ఇవ్వనేలేదు. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారు. ఆనాడు మీరు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి. మీ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేళ్ల వెనక్కి వెళ్లింది'' అని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.


''కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టింది. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి. వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పాటలు పాడుకుంటున్న పరిస్థితి. పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు, స్కాలర్ షిప్పుల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు, జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు, డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది, ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు, ఇళ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు, సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు , పింఛన్లు పెంచాలంటూ వృద్ధులు, బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్‌గా రోడ్ల మీదకు తెచ్చారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటే, పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టావు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచావు'' అని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.


 


''మీరు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు రేవంత్ రెడ్డి, సక్సెస్ ఫుల్‌గా ప్రజల్ని మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలి. ఏడాది కావొస్తుంది. ఇప్పటికైనా కళ్లు తెరవండి. అద్భాతాలు చేశామనే భ్రమ నుంచి బయటపడి ఇచ్చిన హామీలు అమలు చేయండి. గోబెల్స్ ప్రచారాలు పక్కన బెట్టి పరిపాలన మీద దృష్టి సారించండి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయండి. మీ వైఫల్యాలను గుర్తించి మోసం చేసినందుకు వరంగల్ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మాట ఇచ్చాం, పూర్తి చేశామని మహిళలకు ఇచ్చిన హామీల పట్ల కోట్లు వెచ్చించి ప్రకటనలు జారీ చేసినంత మాత్రాన అబద్దాలు నిజమైపోవు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీగా మహిళలకు చెప్పిన రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారో, కల్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో, స్వయం సహాయక సంఘాలకు షరతులు లేకుండా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలి, తేదీలు ప్రకటించాలి'' అని హరీష్‌రావు డిమాండ్ చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa