ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డుదారులకు బ్యాడ్‌న్యూస్.. ఆ హామీ మరింత ఆలస్యం, ఇక ఉగాది నుంచే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 06:57 PM

తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఇది నింజగా బ్యాడ్‌న్యూసే. జనవరి నుంచి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ హాస్టల్స్, అంగన్‌నాడీ కేంద్రాలకు మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. జనవరి నుంచి లబ్దిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి లబ్దిదారుడికి కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సన్న బియ్యం పంపిణీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.


సంక్రాంతి నుంచి తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా.. 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని అధికారులు తెలిపారు. అన్నం పొల్లు పొల్లు కాకుండా ముద్దగా మారుతుందని అన్నారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాతే అన్నం తినటానికి అనుకూలంగా ఉంటుందన్నారు. దీంతో సంక్రాంతి నుంచి అనుకున్న సన్న బియ్యం.. ఉగాది నుంచి అమలయ్యే ఛాన్స్ ఉంది.


జనవరి 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు


ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చే జనవరి 31 వరకు కొనసాగుతాయని తెలంగాణ సివిల్ సప్లయ్ డిపార్ట్‌మెంట్ ముఖ్య కార్యదర్శి డీఎస్‌ చౌహాన్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,086 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. రేషన్‌లో సన్నబియ్యం ఉగాది నుంచి పంపిణీ చేయొచ్చునని చెప్పారు. జనవరి నుంచి రేషన్‌ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ.. 3 నెలలు మగ్గిన తర్వాత బియ్యం బాగుంటాయని నిపుణులు చెబుతున్నారన్నారు. అందుకే ఉగాది నుంచి పంపిణీ చేయడానికి అనుకూలంగా ఉంటాయన్నారు.


ఈ నెల మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. దాని విలువ రూ.3,045.76 కోట్లు ఉంటుందన్నారు. ఇందులో 10.11 లక్షల టన్నులు దొడ్డు రకం వడ్లు కాగా.. 3.02 లక్షల టన్నులు సన్నాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ సీజన్‌లో మొత్తం 70 లక్షల టన్నుల మేర సేకరిస్తామని అంచనా వేస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు. తెలంగాణ బియ్యం నాణ్యమైనవని ఎఫ్‌సీఐ గుర్తించిందని వెల్లడించారు. 11 రాష్ట్రాల నుంచి వీటి కోసం డిమాండ్‌ వచ్చిందన్నారు. ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలు తెలంగాణ బియ్యం దిగుమతికి అంగీకరించాయన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa