సండే వచ్చిందంటే చాలు చాలా మంది చికెన్ షాప్కు వెళ్లి కోడి మాంసం తెచ్చుకుని ఇష్డంగా వండుకొని తింటుంటారు. గ్రామాల్లో అయితే సహజసిద్ధంగా పెరిగే నాటుకోళ్లను ఆహారంగా తీసుకుంటారు. పట్టణాల్లో అలా కాదు. ఫారాల్లో పెంచిన కోళ్లను చికెన్కు తీసుకుంటాం. అయితే ఫారాల్లోని కోళ్లు త్వరగా పెరిగేందుకు, రోగాల బారిన పడి చనిపోకుండా వాటికి యాంటీ బయాటిక్స్ ఇస్తుంటారు. దీని ద్వారా వాటిల్లో ప్రమాదకర బ్యాక్టీరియా వృద్ది చెందుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ప్రత్యేకంగా తెలంగాణ, కేరళల్లో అమ్మే బ్రాయిలర్ కోళ్లలో యాంటీ బయాటిక్స్ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ సైంటిస్టులు గుర్తించారు.
చాలా వరకు పౌల్ట్రీ ఫామ్స్లో కోళ్లకు అవసరమున్నా.. లేకపోయినా విచక్షణరహితంగా యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. దీంతో కోళ్లలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతుందని నిర్ధారించారు. ఇటువంటి చికెన్ను సరిగ్గా ఉడికించకుండా తింటే చాలా ప్రమాదం అని.. ఏఎంఆర్ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల తెలంగాణ, కేరళలోని 47 పౌల్ట్రీఫామ్స్లో గల 131 కోడి రెట్టల శాంపిళ్లను ఎన్ఐఎన్ సైంటిస్టులు సేకరించారు. వాటి నుంచి డీఎన్ఏను వేరు చేసి ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కోడి రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ ఆరియస్తో పాటుగా.. ప్రమాదకరమైన క్లాస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్, సూడోమోనాస్ ఎరుగినోసా, క్లేబ్సియెల్లా ఎంటరోకోకస్ ఫెకాలిస్, బాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు.
ఈ బ్యాక్టిరియా మానవుల్లో యాంటీ బయాటిక్ ట్రీట్మెంట్కు సవాల్ విసిరుతాయని అంటున్నారు. ఇలాంటి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95 శాతం బ్యాక్టీరియా నాశనమవుతుందని చెబుతున్నారు. అలా ఉడికించకుండా తింటే ప్రమాదమని అన్నారు. యాంటీ బయాటిక్స్కు ఏఎంఆర్ సవాల్ విసురుతుందని అంటున్నారు. ఈ బ్యాక్టీరియా న్యుమోనియా, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేసి ట్రీట్మెంట్కు సైతం సవాల్గా మారుతుందని అంటున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తక్షణమే అరికట్టాల్సి ఉందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa