ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగూడెం ఎయిర్‌పోర్టు.. ఈ గ్రామాల మధ్యే, వడివడిగా అడుగులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 07:09 PM

తెలంగాణలో కొత్తగా 4 ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఒక్కటే ఉండగా.. వరంగల్ మామూనూరులో, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే వరంగల్‌ మామూనూర్‌ విమానాశ్రయ పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశారు. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.


జిల్లాలో సుమారు 950 ఎకరాలను గుర్తించగా.. విమానాశ్రయానికి సంబంధించి ముందస్తు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ని ఇటీవల కోరింది. లోకేషన్, 10 సంవత్సరాల వాతావరణ డేటా వంటి అన్ని వివరాలను అధ్యయనం కోసం కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, రాష్ట్రంలో 4 విమానాశ్రయాలను ప్రతిపాదించగా.. కొత్తగూడెం ఎయిర్‌పోర్టును గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.


కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం గుడిపాడు-బంగర్లుజాల గ్రామాల మధ్య ఎయిర్‌పోర్టును గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఆ స్థలం సరిపోవడం లేదని ఏఏఐ అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లా యంత్రాంగం కొత్తగూడెం మండలం రామవరం, సుజాతనగర్, చుంచుపల్లి గ్రామాల్లో భూమిని గుర్తించింది. ఈ గ్రామాల మధ్యే ఇప్పుడు కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించనున్నారు. కానీ ప్రతిపాదిత స్థలంలో పాక్షికంగా అటవీ భూమి ఉంది. దీనికి పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నుండి క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఆయా అనుమతి రాగానే స్వాధీనం ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.


హైదరాబాద్‌ నగరానికి 270 కి.మీ దూరంలో కొత్తగూడెం ఉంటుంది. దీంతో ఇక్కడ విమానాశ్రయం కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా జిల్లాలో సింగరేణి కార్యాలయాలు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది. భద్రాచలం రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు కూడా ఈ ఎయిర్‌పోర్టు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఎయిర్‌పోర్టు విషయమై.. సీఎం రేవంత్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇప్పటికే మాట్లాడారని అధికార వర్గాలు చెబుతున్నాయి. సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తి చేసి త్వరలోనే విమానాశ్రయ ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa