తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్, రూ.2 లక్షల రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఒకటి. రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. సొంత జాగా ఉన్న పేదవారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది.
ఈ పథకం అమలు కోసం చాలా మంది ఇండ్లు లేని పేదలు ఎదురు చూస్తున్నారు. ఈ నెల తొలివారంలోనే పథకం ప్రారంభం అవుతుందని భావించినా.. అమలు కాలేదు. దీంతో ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా.. అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3,500 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని.. పూర్తి పారదర్శకంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు.
కాగా, తొలి విడతలో ఖాళీ జాగా ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన లబ్దిదారులు 400 చదరపు అడుగుల్లో కొత్త ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కొత్త ఇందిరమ్మ ఇంట్లో స్నానాల గదితో పాటు వంట గది తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టినట్లు వెల్లడించారు.ఈ మేరకు అర్హులైన పేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.
మెుత్తం నాలుగు విడతల్లో ఈ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. పునాది నిర్మాణం పూర్తి కాగానే రూ. లక్ష, లెంటల్ లెవల్కు చేరగానే రూ.1.25 లక్షలు, ఇంటి స్లాబు వేశాక రూ. 1.75 లక్షలు, గృహప్రవేశం సమయంలో రూ. లక్ష ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa