ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కమాటతో భారీ యుద్ధ విన్యాసాలు,,,చైనా, తైవాన్ మధ్య చిచ్చు పెట్టిన జపాన్ ప్రధాని

international |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 09:12 PM

తైవాన్ జలసంధిలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్‌ను రక్షించేందుకు తాము వెనుకాడబోమంటూ జపాన్ ప్రధాని సనాయె తకాయిచి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఇరుదేశాల మధ్య చిచ్చు రేపాయి. దీనికి ప్రతిచర్యగా చైనా తన సైనిక బలగాలను తైవాన్ చుట్టూ భారీగా మోహరించి ‘జస్టిస్ మిషన్ 2025’ పేరుతో సంచలన యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. ఈ పరిణామం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలను పెంచింది.


జపాన్ హెచ్చరిక.. చైనా ఆగ్రహం!


తైవాన్‌పై చైనా దాడి చేస్తే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని.. ఇది తమ దేశ మనుగడకు సంబంధించిన సమస్యగా మారుతుందని జపాన్ ప్రధాని సనాయె తకాయిచి ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను బీజింగ్ తీవ్రంగా పరిగణించింది. చైనా అంతర్గత విషయాల్లో జపాన్ జోక్యం చేసుకుంటోందని మండిపడుతూ.. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. దీనికి కౌంటర్‌గా తైవాన్‌ను దిగ్బంధించేలా తన నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్ దళాలను రంగంలోకి దించింది.


జస్టిస్ మిషన్ 2025 వ్యూహం ఇదే..!


చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ షి యీ మాట్లాడుతూ.. ‘జస్టిస్ మిషన్ 2025’లో భాగంగా సముద్ర, గగనతల యుద్ధ సన్నద్ధతను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం, బయటి దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకోవడం, క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడం దీని ప్రధాన లక్ష్యం. అయితే ఇది తైవాన్ వేర్పాటువాద శక్తులకు, బయటి శక్తులకు (అమెరికా, జపాన్) ఒక తీవ్రమైన హెచ్చరిక అని చైనా స్పష్టం చేసింది.


మరోవైపు తైవాన్‌కు సుమారు 11 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.98 వేల 902 కోట్లు) విలువైన భారీ ఆయుధ ప్యాకేజీని విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అత్యాధునిక డ్రోన్లు, మిస్సైల్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అమెరికాకు చెందిన 20 రక్షణ రంగ సంస్థలు, 10 మంది ఉన్నతాధికారులపై ఆంక్షలు విధించింది. ఇందులో బోయింగ్, నార్త్‌రాప్ గ్రమ్మన్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల ఆస్తులను ఫ్రీజ్ చేయడమే కాకుండా.. చైనాతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది.


ప్రస్తుతం తైవాన్ చుట్టూ 5 వ్యూహాత్మక ప్రాంతాలలో చైనా లైవ్-ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తోంది. జపాన్ కూడా తన రక్షణ బడ్జెట్‌ను రికార్డు స్థాయికి పెంచి.. చైనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ అగ్రరాజ్యాల పోరు ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa