తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 07వ తేదీతో ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా తెరపైకి రావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సవాలు చేస్తూ.. అటు హీరో అక్కినేని నాగార్జున, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేరువేరుగా పరువు నష్టం దావాలు వేయగా.. వాటిపై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసు తెరపైకి రావటం.. అది కూడా విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో విచారణకు రావటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ప్రచారంలో బీజేపీ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ.. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నాంపల్లి కోర్టు గురువారం (నవంబర్ 28న) రోజు విచారణ చేపట్టింది.
అయితే.. బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని.. ఆయన చేసిన ఆరోపణలు అటు పార్టీకే కాకుండా ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తీవ్రమైన అసత్య ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే.. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ కేసును డిసెంబర్ 11కు వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే.. మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో కూడా కీలక పరిణామం చోటుచేసుకుంది. నాగార్జున వేసిన పిటిషన్ను గురువారం (నవంబర్ 28న) పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు.. మంత్రి కొండా సురేఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసం.. ఆరోజున మంత్రి కొండా సురేఖ నేరుగా ధర్మాసనం ఎదుట హాజరు కావాలని.. ఆమె చేసిన వ్యాఖ్యలపై స్వయంగా వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అటు మంత్రిని నేరుగా ధర్మాసనం ముందు హాజరుకావాలనటంతో పాటు.. ఇటు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే పరువు నష్టం దావా వేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa