ప్రస్తుతం రకరకాల మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు అమాయకులను టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్లో ఓ మహిళా రూ. రెండున్నర కోట్ల విలువైన 21 కార్లను కొట్టేసింది. చాలా ఈజీగా కార్ల యజమానులకు టోకరా వేసింది. అద్దె ఆశ చూపించి రెండు నెలల కాలంలోనే కార్లు కొట్టేసింది. పక్కా నిఘా ఉంచిన పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు.
మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి టెలికాంనగర్లోకు చెందిన జూపూడి ఉష గృహిణి. ఈమెకు షేక్పేట నాలాకు చెందిన డ్రైవర్ తుడుముల మల్లేష్ పరిచయమయ్యాడు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు మోసాల బాట పట్టారు. నగరంలో పలువురి వద్ద కార్లను రెంట్కు తీసుకున్నారు. ఆ కార్లను అత్తాపూర్లో ఉంటున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాగర్పాటిల్, జమనే అనిల్ కుమార్ అనే వ్యక్తులకు విక్రయించేవారు.చాలా చౌకగా.. రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలకు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకునేవారు.
కార్ల యజమానులు తమ కార్ల గురించి నిలదీయగా.. మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసేవారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత నెల 10న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. పక్కా నిఘా ఉంచిన పోలీసులు ఉషతోపాటు ఆమెకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
కాగా, ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో నగరంలో ఎక్కువయ్యాయి. బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన ఓ రెంటల్ కారు యజమాని కారును సైతం ఓ వ్యక్తి అద్దె ప్రతిపాదికన తీసుకెళ్లాడు. ఆ తర్వాత కారును అమ్మేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడు. బాధిత కారు యజమాని పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును కోర్టు ద్వారా తిరిగి ఇప్పించారు. తన కారును తిరిగి పొందేందుకు సదరు బాధిత కారు యజమాని అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. రెంటల్ కార్ల వ్యాపారం చేసే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు. కార్లను తీసుకెళ్లేవారి పూర్తి వివరాలు తెలిస్తేనే అద్దెకు ఇవ్వాలని లేదంటే.. తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa