ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్దిపేటలో తిరుమల శ్రీవారి ఆలయం.. టీటీడీ ఛైర్మన్‌కు హరీష్ రావు రిక్వెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 06:37 PM

తెలుగు ప్రజలంతా కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.. త్వరలోనే సిద్దిపేట లో కొలువు దీరనుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. మంగళవారం (డిసెంబర్ 09న) తిరుపతి వెళ్లిన హరీశ్‌ రావు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిశారు. సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం చేపట్టాలని కోరారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం కోమటి చెరువు ప్రాంతంలో ఇప్పటికే.. 5 ఎకరాల 10 గుంటల స్థలాన్ని మంజూరు చేశామని టీటీడీ ఛైర్మన్‌తో హరీశ్‌రావు తెలిపారు.


గతంలోనే టీటీడీకి చెందిన ఇంజనీరింగ్ అధికారులు కోమటి చెరువు ప్రాంతంలో పర్యటించి ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారని బీఆర్ నాయుడికి తెలిపారు. అందులు అనుగుణంగానే ఆలయ నిర్మాణ నమునా, డిజైన్లను కూడా రూపొందించారని వివరించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని తెలుగు ప్రజలంతా ఎంతో ఇష్టంగా కొలుస్తారని.. ఇలవేల్పుగా భావిస్తారని తెలిపారు. అలాంటి శ్రీవారి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం గొప్ప అదృష్టమని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.


వచ్చే టీటీడీ బోర్డు మీటింగ్‌లో సిద్దిపేటలో వెంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపేలా చొరవ తీసుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా బీఆర్ నాయుడినే రావాల్సిందిగా హరీష్ రావు కోరారు. అందుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. వెంటనే చీఫ్ ఇంజనీర్ అధికారి, సంబంధిత అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో.. సిద్దిపేటలో త్వరలోనే.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు కొలువుదీరనున్నాడన్న మాట.


కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తిరుమలేశుని దేవాలయాలు నిర్మించటమే కాకుండా పాడుబడిపోతున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించే బృహత్కార్యాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. సిద్దిపేటలో కూడా టీటీడీ ఆలయాన్ని నిర్మించేందుకు గతంలోనే ప్రతిపాదన చేశారు. అందుకు కావాల్సిన స్థలాన్ని కూడా కేటాయించటం.. దాన్ని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించటం, డిజైన్లు కూడా ఫైనల్ చేయటం జరిగిపోయాయి. అయితే.. తెలంగాణ, ఏపీల్లో ప్రభుత్వాలు మారటం, టీటీడీ బోర్డు కూడా మారిపోవటంతో.. ఈ నిర్మాణ పనులు పట్టాలెక్కలేదు. దీంతో.. హరీష్ రావే మరోసారి టీటీడీ ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లటం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa