ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద అభిమానుల తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో.. పలు సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా.. ఈరోజు (డిసెంబర్ 13న) అదుపులోకి తీసుకున్నారు. ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన విచారించిన అనంతరం.. గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు.
అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్ను పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. "చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయి." అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు కామెంట్స్ చేశారు. మరోవైపు.. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. ఓవైపు సీరియస్గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. కేబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలతో చర్చలు జరగాలని మీడియాతో చిట్ చాట్లో ఈ కామెంట్స్ చేశారు.
మరోవైపు.. అల్లు అర్జున్ అరెస్టును మిగతా పార్టీల రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ అరెస్టును ఖండించారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ అతి చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. తొక్కిసలాటకు డైరెక్టుగా ఏమాత్రం సంబంధం లేదని అల్లు అర్జున్ను ఒక క్రిమినల్లా ట్రీట్ చేయటం సరికాదని.. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ అభద్రతాకు పరాకాష్ఠ అని తెలిపారు. ఇదే లాజిక్ ప్రకారం.. హైడ్రా వల్ల అభద్రతతో ఇద్దరు అమాయకులు చనిపోయారని.. దానికి బాధ్యుడైన సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa