హైదరాబాద్ మెట్రో విస్తరణకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్, ఎంజీబీఎస్-జేబీఎస్ కారిడార్లో మెట్రో పరుగులు పెడుతుండగా.. కొత్తగా మరో ఐదు కారిడార్లను ప్రతిపాదించి డీపీఆర్ను కేంద్రానికి పంపారు. కాగా.. మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్లో నాగోల్-ఎల్బీనగర్ మార్గాన్ని కనెక్ట్ చేయనున్నారు. ఈ లింకుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. 5 కి.మీ. దూరం ఉండే ఈ మార్గాన్ని పూర్తి చేస్తే నగరంలో రెండో సర్క్యూలర్ మెట్రోకారిడార్ అందుబాటులోకి రానుంది.
మెట్రో ట్రైన్ ఫస్ట్ ఫేజ్లో జేబీఎస్-ఎంజీబీఎస్-అమీర్పేట మార్గాల్లో ఇప్పటికే ఒక మెట్రో రింగు అందుబాటులో ఉంది. వలయమైనా ఒకటే మెట్రోలో ప్రయాణించలేం.. మెట్రోలు మారాల్సి ఉంటుంది. ఈ మార్గాల్లో గమ్యస్థానం చేరేందుకు మెట్రో దిగి బస్సులు, ఆటోలను, క్యాబ్లను ఆశ్రయించాల్సిన అవసరం తప్పనుంది. కేవలం మెట్రో మారితే సరిపోతుంది. తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. సాంకేతికత సమస్యలతో ఒక మార్గంలో ఎవైనా సమస్యలు తలెత్తితే రెండో మార్గాన్ని సైతం ఉపయోగించుకోవచ్చు. మెట్రో రింగు కాబట్టి ఏ మార్గంలో వెళ్లినా గమ్యస్థానం త్వరగా చేరుకోవచ్చు.
నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో పూర్తి చేస్తే ఎల్బీనగర్-అమీర్పేట-ఎల్బీనగర్ వరకు పెద్ద మెట్రో రింగు అందుబాటులోకి వస్తుంది. ఈ పరిధిలోనే 41 స్టేషన్లు ఉండబోతున్నాయి. నాగోల్ నుంచి ఎంజీబీఎస్కు మెట్రోలో వెళ్లాలంటే ప్రస్తుతం నాగోల్ నుంచి పరేడ్గ్రౌండ్కు వెళ్లి అక్కడి నుంచి ఎంజీబీఎస్కు చేరుకోవాల్సి వస్తుంది. మెట్రో కంటే బస్సులో వెళితే తొందరగా చేరుకోవచ్చునని ప్రయాణికుల అభిప్రాయం. మెట్రో రింగు మార్గం పూర్తైతే నాగోల్ నుంచి ఎల్బీనగర్-ఎంజీబీఎస్కు చాలా తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు.
ఇక ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ మెట్రో మార్గం పొడగించాల్సి ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట మార్గం పూర్తిచేస్తే నగంరలో మూడో మెట్రో రింగు మార్గం అవుతుంది. అప్పుడు దిల్సుఖ్నగర్ స్టేషన్ నుంచి ఈ సర్క్యులర్లో తమకు కావాల్సిన స్టేషన్కు చాలా సౌకర్యవంతంగా తక్కువ సమయంలోనే మెట్రో ట్రైన్లో చేరుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa