ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూ ఇయర్ గిఫ్ట్.. అక్కడి వరకూ మెట్రో.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 01, 2025, 07:26 PM

హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. నూతన సంవత్సరం తొలి రోజు నగరవాసులకు శుభవార్త వినిపించింది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న మెట్రో రైలు కలను నెరవేర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరబాద్ నార్త్ సిటీ వైపుగా మెట్రో రైలు పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్, శామీర్‌పేట్ వరకూ పొడిగించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకూ 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్‍పేట్ వరకూ 22 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


డీపీఆర్‌లు సిద్ధం చేసి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ -2బిలో భాగంగా వీటిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎన్వీఎస్ రెడ్డి, పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ దానకిషోర్‌తో చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్యారడైజ్ నుంచి తాడ్‌బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ వరకూ 23 కిలోమీటర్ల మేరకు మెట్రో కారిడార్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అలాగే జేబీఎస్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి, ఆళ్వాల్, హకీంపేట మీదుగా శామీర్‌పేట వరకూ 22 కిలోమీటర్ల మేరకు మరో మెట్రో కారిడార్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి.


మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రస్తుతం మూడు మార్గాల్లో నడుస్తోంది. నిత్యం సుమారుగా ఐదు లక్షల మంది వరకూ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఇక ఆఫీసు వేళల్లో మెట్రో రైళ్లు పూర్తిగా నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెట్రో విస్తరణకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం, ఎంజీబీఎస్- జేబీఎస్ కారిడార్లలో మెట్రో నడుస్తోంది. కొత్తగా నాగోల్ – శంషాబాద్, మియాపూర్ – పటాన్‌చెరు, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, ఎల్‌బీనగర్ – హయత్ నగర్, రాయదుర్గం – కోకాపేట్ మార్గాల్లో విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు డీపీఆర్‌‌లను సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. తాజాగా హైదరబాద్ నార్త్ సిటీ వాసుల కల నెరవేరుస్తూ మేడ్చల్, శామీర్‌పేట్ వరకూ మెట్రో పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. డీపీఆర్ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa