కృషి ఉంటే మనుషులు రుషులవుతారో లేదో తెలియదు కానీ.. అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేధిస్తారన్నది అక్షరాల నిజం. పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో పాటు అందుకు తగిన కృషి తోడైతే.. కాస్త ఆలస్యమైనా సరే ఫలితం కచ్చితంగా ఉంటుంది. దాన్నే ప్రాక్టికల్గా నిరూపించాడు మన తెలంగాణ డ్రిల్ మ్యాన్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు.. ఒళ్లుగగుర్పొడిచే సాహసాలను ఒకే వేదికపై చేసి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాధించుకున్నాడు. అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుటి అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ.. రొటీన్కు కాస్త భిన్నంగా ఆలోచించి ఎవరూ చేయలేని సాహసాలు చేసి.. అసమాన్యుడిగా నిలుస్తున్నాడు మన తెలంగాణ డ్రిల్ మ్యాన్.
యాదాద్రి జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్.. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి పనికెర సత్తయ్య ఓ తాపీ మేస్త్రి, తల్లి వ్యవసాయ కూలీ. అయితే.. సూర్యాపేటలో క్రాంతి కుమార్ ఇంటర్ చదువుతున్న సమయంలో ఇంటి నుంచి పంపించే డబ్బుల కోసం ఎదురు చూడకుండా.. స్థానికంగా ఉంటే ఓ మిర్చి బండి దగ్గర పనిచేశాడు. అయితే.. సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే కేవలం కష్టపడితే సరిపోదని.. ఏదో ఒకటి భిన్నంగా చేసి తనను తాను నిరూపించుకోవాలన్న భావన క్రాంతి మనసులో నాటుకుపోయింది.
దీంతో.. ఎవ్వరికీ సాధ్యంకాని పనులు చేయాలన్న భావనతో.. అప్పటి నుంచే కొన్ని వినూత్న సాహసాలను సాధన చేయటం మొదలుపెట్టాడు. అలా మొదలైందే క్రాంతి సాహసాల జీవితం. ప్రధానంగా.. తాను సాధించిన నాలుగు రికార్డుల్లో ఒకటైన.. వేడివేడి నూనెలోంచి బజ్జీలను తీయడమనేది.. బజ్జీల బండి దగ్గర పనిచేసే సమయం నుంచే ప్రాక్టీస్ చేయటం గమనార్హం. దాంతో పాటు ముక్కులో మొలలు కొట్టుకోవడం లాంటి సాహసాలు కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ప్రాక్టీస్ చేయటమే కాదు.. సమయం, వేదిక దొరికినప్పడల్లా కాలేజీలో, ఇతర చోట్ల ప్రదర్శించడం ప్రారంభించాడు.
ఈ క్రమంలోనే.. డ్రిల్ మిషన్తో ముక్కులో 4 ఇంచుల డ్రిల్ వేసుకోవడం, మేకులను కొట్టుకోవడం వంటి ప్రదర్శనలతో కాస్త పేరు సంపాధించుకున్నారు. ఇందులో భాగంగానే.. 2011లో ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో కాంత్రి ప్రదర్శించిన విన్యాసాలతో ఒక్కాసారిగా ఫేమస్ అయ్యాడు. తన అసాధారణ సాహసాలతో.. తెలంగాణ డ్రిల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. అమెరికా, మలేషియా, సింగపూర్, స్పెయిన్, ఇటలీ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో విన్యాసాలు ప్రదర్శించి రికార్డులు సృష్టించాడు.
ఈ క్రమంలోనే.. 2024 ఫిబ్రవరిలో ఇటలీలోని మిలాన్ నగరంలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు ప్రదర్శించాడు క్రాంతి కుమార్. ఒకే వేదికపై నాలుగు ప్రదర్శనలు చేసి.. ఒకేసారి నాలుగు రికార్డులు సాధించాడు. మొదటిది.. నాలుకతోనే 60 సెకన్లలో 57 టేబుల్ ఫ్యాన్లను ఆపేసి ఔరా అనిపించాడు. రెండోది.. కత్తులను గొంతులో పెట్టుకుని తాడు సాయంతో 1,944 కిలోల బరువున్న వాహనాన్ని 5 మీటర్ల మేర లాగి రెండో రికార్డు సాధించాడు. 60 సెకన్లలో 22 సార్లు 4 అంగుళాల మేకులను ముక్కులో కొట్టుకుని మూడో రికార్డు సాధించాడు. ఇక.. 300 డిగ్రీల వేడి వేడి నూనెలో 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను బయటకు తీసి నాలుగో రికార్డు క్రియేట్ చేశాడు.
క్రాంతి కుమార్ చేసిన ఈ సాహసాలు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయక పోవడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ తన బుక్లో స్థానం కల్పించింది. ఇటీవల ఆ సంస్థ నిర్వాహకులు క్రాంతికుమార్కు అవార్డులు ప్రదానం చేశారు. క్రాంతి కుమార్ సాధించిన నాలుగు వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డుల పట్ల సొంత గ్రామమైన అడ్డగూడూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ గ్రామానికే కాదు దేశానికే క్రాంతి కుమార్ పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాడని అతని స్నేహితులు కొనియాడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa