తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ సంక్రాంతి కానుకగా రైతుభరోసా ఇస్తుందని అంతా ఊహించారు. కానీ.. రైతుభరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఈ మూడు హామీలను జనవరి 26 నుంచి అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో.. రాష్ట్ర ప్రజలు కాస్త నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో.. తెలంగాణవాసులకు మరో గుడ్ న్యూస్ వినిపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సంక్రాంతి కానుకగా.. ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని వారు ఎవరో రెచ్చగొడితే వాళ్ల మాటలు విని అభద్రతకు లోనూ కావొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 హామీలు నెరవేరుస్తామని పేర్కొన్నారు. రైతుబంధు ఇవ్వలేదని, ఇండ్లు ఇవ్వలేదంటూ కేసీఆర్ టీం దుష్ప్రచారం చేస్తుంటుందని.. వారి అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపుల్లో ప్రత్యర్థులు రెచ్చగొట్టే చర్యలకు మీరు బలికావొద్దని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టి వదిలేసిన అన్ని ఇండ్లని పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 ఇస్తున్నామని తెలిపారు. గ్రామ కమిటీలో అర్హులైన వారికి ఇల్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఆ భూములకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం..
ఈ క్రమంలోనే.. రైతు భరోసా అమలుపై కూడా క్లారిటీ ఇచ్చారు. సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతుబంధు అందిస్తామని.. కానీ.. రియల్ ఎస్టేట్ భూములకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుభరోసా విషయంలో ఎవరు అభద్రతకు లోను కావొద్దని.. అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు.
మరోవైపు.. కేటీఆర్ కేసుపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కక్షపూరితంగా చర్యలు చేపట్టడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కారు రేసింగ్లో చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్.. లొట్టపీస్ ముఖ్యమంత్రి అన్నారని.. ఆయన బాషకు ఓ నమస్కారం అంటూ ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారన్నారు. విచారణ కాకుండా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరినీ అరెస్టు చేయదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa