బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు పోలీసులు షాక్ ఇచ్చారు. నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రేపు (జనవరి 21న) నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు.. పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. దీంతో.. రేపటి రైతు మహాధర్నాను బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది. రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించటాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ రైతు మహాధర్నాను వాయిదా వేయనున్నట్టు సమాచారం.
అయితే.. బీఆర్ఎస్ చేయతలపెట్టిన రైతు మహాధర్నా కారణంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని.. ట్రాఫిక్కు కూడా అంతరాయం కలుగుతుందని పేర్కొంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. సంక్రాంతి సెలవులు ముగిసిపోయిన నేపథ్యంలో.. సొంతగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టగా.. ఈ సమయంలో ధర్నా చేయటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.
ఎన్నికల సమయంలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిర్వహించ తలపెట్టిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో.. పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. కానీ పోలీసులు చివరి నిమిషంలో ఇచ్చిన ట్విస్ట్తో.. ధర్నా వాయిదా పడింది. ధర్నాకు అనుమతి నిరాకరించడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది విషయంపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమేనని ఆరోపించారు. కేటీఆర్ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి సర్కార్ భయపడుతోందన్నారు. రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుపై నిలదీయొద్దా అని అడిగారు. హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని అడగడం తప్పా అంటూ చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa