చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎం రంగరాజన్ మీద దాడి జరిగింది. ఇక్ష్వాకు వంశస్థుల పేరుతో సుమారు 20 మంది వరకు రంగరాజన్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. రాజరాజ్య స్థాపన పేరుతో.. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించారు. నల్లరంగు దుస్తులు ధరించి ప్రైవేటు సైన్యాన్ని తలపించేలా వచ్చిన గుంపు.. చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో ఉన్న రంగరాజన్ ఇంట్లోకి చొరబడ్డారు. రంగరాజన్ను కింద కూర్చోబెట్టి.. వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తి ప్రశ్నలు సంధిస్తూ, ఏమి తెలియదని, పురోహితుని రూపంలో ఉన్న కపట వేషధారి అంటూ దూషించాడు. తాము రామరాజ్య స్థాపన కోసం పోరాడుతున్నామని, తమకు సహకరించాలని బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే... ఈ ఘటన ఫిబ్రవరి 07వ తేదీన తెల్లవారుజామును చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్చకులు రంగరాజన్, ఆయన కుమారుడు చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ కలిసి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి గుంపుగా వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవగా.. వాటిని పోలీసులకు సమర్పించారు.
ఇక్ష్వాకు వారసులమని చెప్పుకునే కొంత మంది వ్యక్తులు, ప్రైవేట్ సైన్యాలతో తమ రామరాజ్యాన్ని స్థాపించాలని పోరాడుతున్నామని.. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారని.. అందుకు తాను నిరాకరించానని పోలీసులకు రంగరాజన్ తెలిపారు. రామరాజ్యం పేరుతో వచ్చిన వ్యక్తుల మాట నిరాకరించినందుకు తన కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైన దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగరాజన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడైన వీర రాఘవ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం రంగరాజన్ క్షేమంగా ఉన్నాడని.. ఆయన సేవలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa