ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యులకు ఊరట..దిగొస్తున్న పప్పుల ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 10:16 AM

నిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన పప్పుల ధరలు దిగొస్తున్నాయి. గతేడాది రూ.200-240 వరకు వెళ్లిన నాణ్యమైన కేజీ కందిపప్పు ప్రస్తుతం రూ.150-160కి వచ్చింది. క్వాలిటీ తక్కువుండే పప్పు రూ.110-125 పలుకుతోంది. శనగ పప్పు రూ.150 నుంచి రూ. 135, మినప పప్పు రూ.160 నుంచి రూ.150కి, మైసూర్ పప్పు రూ.130 నుంచి రూ.115కి తగ్గింది. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు, మార్కెట్లకు సరఫరా పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.రాష్ట్రంలో రెండేండ్లుగా అపరాల (పప్పుధాన్యాలు) సాగు పెరుగుతోంది. గతేడాది 5 లక్షల 24 వేల 595 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సారి 5 లక్షల 90 వేల 209 ఎకరాల్లో అపరాల సాగు చేపట్టారు. అంటే గతంతో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే 65,614 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. గతేడాదితో పోలిస్తే కంది 43 వేల 444 ఎకరాల్లో, పెసర19 వేల ఎకరాల్లో, మినుములు 3 వేల ఎకరాల్లో అదనంగా సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్​నగర్ జిల్లాల్లో అపరాల సాగు అత్యధికంగా నమోదైంది. వికారాబాద్ జిల్లా తాండూరు కంది పప్పుకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కానీ రాష్ట్రంలో మార్కెట్లన్నీ దళారులు చేతుల్లో ఉండడంతో అపరాలు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని వ్యాపారుల మోసాలకు చెక్ పెట్టి.. రైతులకు ఎంఎస్పీ దక్కేలా చూస్తేనే పప్పుధాన్యాల సాగు పడిపోకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa