రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట- విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ పనులు కొనసాగుతున్న కారణంగా.. ఖమ్మం మీదుగా వరంగల్, విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు పూర్తి రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే రద్దయిన రైళ్లలో కొన్నింటిని నిర్ణీత తేదీల్లో నడిపించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ముఖ్యంగా.. భద్రాచలం- విజయవాడ, డోర్నకల్- విజయవాడ ప్యాసింజర్లు, గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 10 నుంచి 20 వరకు పది రోజుల పాటు రద్దు చేశారు. అయితే.. ఖమ్మం మీదుగా మొత్తం 107 రైళ్లు నడుస్తుండగా.. అందులో 30 రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట-విజయవాడ మధ్య రైల్వే అమృత్ పథకం కింద.. మూడో రైల్వే లైన్ పనులు శరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఖమ్మం మీదుగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసి మరీ.. మరింత వేగంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఇందు కోసం ఖమ్మం రైల్వే స్టేషన్లో రెండో ప్లాట్ ఫామ్ను కొంత మేర కూల్చివేశారు.
కొండపల్లి నుంచి కాజీపేట వరకు పలు స్టేషన్లలో ఇప్పటికే మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తవగా.. మిగిలిన ప్రాంతాల్లో కూడా పనుల్లో వేగం పెంచారు. జూన్ వరకు ఈ మూడో రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుని.. ఆ దిశగా చకచకా పనులు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే.. కొండపల్లి- మధిర మధ్య మూడో లైన్ నిర్మాణం పనులు ఇప్పటికే పూర్తవగా.. ఇటీవల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇక.. మధిర నుంచి మోటమర్రి వరకు మూడో లైన్ను మార్చి వరకు పూర్తిచేయాలని, మోటమర్రి నుంచి పందిళ్లపల్లి స్టేషన్ వరకు ఏప్రిల్లోపు పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
మూడో రైల్వే లైన్ పనుల కారణంగా.. ఆ మార్గాల్లో నడిచే కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం గమనార్హం. అయితే ఖమ్మం వరకు పనులు పూర్తయిన తర్వాత.. ఖమ్మం నుంచి డోర్నకల్ వరకు, ఆ తర్వాత డోర్నకల్ నుంచి మహబూబాబాద్ వరకు దశలవారీగా పనులు పూర్తి చేయనున్నట్టు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa