ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాంస ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 07:21 PM

మాంస ప్రియులకు ఇప్పటికే గడ్డు కాలం వచ్చి పడింది. వారం వారం హ్యాపీగా చికెన్ తినే భోజన ప్రియులు.. ఈ బర్డ్ ఫ్లూ పుణ్యమా అని.. అటు చికెన్, ఇటు గుడ్లు ఏవీ తికలేక ఇబ్బంది పడుతున్నారు. అటు మటనో, చేపలో తిందామంటే.. ఉన్నట్టుండి రేట్లు పెంచేయటంతో.. అవి కొనలేక, ఇవి తినలేక మాంసప్రియులకు ముద్ద దిగటంలేదు. అయితే.. కొందరు మాత్రం.. డాక్టర్లు చెప్తున్న సూచనలు, జాగ్రత్తలు తీసుకుంటూ చికెన్ తింటున్నారు. అయితే.. వందలో పది మాత్రమే భయపడకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చికెన్ తింటుండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. దీంతో.. చికెన్ వ్యాపారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు చికెన్ మార్కెట్ బంద్ చేయాలని నిర్ణయించారు. అయితే.. ఇది రాష్ట్రమంతటా కాదండోయ్.. కేవలం ఆదిలాబాద్‌లో మాత్రమే.


ఆదిలాబాద్‌లో వారం రోజుల పాటు చికెన్‌ మార్కెట్‌ బంద్‌ చేస్తున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. బర్డ్‌ ఫ్లూ భయంతో చికెన్‌ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయని వ్యాపారం పూర్తిగా పడిపోవటం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. వారం తర్వాత కూడా.. అప్పటి పరిస్థితిని చూసి మార్కెట్ ఓపెన్ చేయాలా వద్దా అని నిర్ణయిస్తామని వ్యాపారులు చెప్తున్నారు. తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ భయం లేదని అధికారులు చెప్పినా.. చికెన్, గుడ్లు తినొచ్చని డాక్టర్లు చెప్పినా.. ప్రజలు మాత్రం భయపడుతూ కొనడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.


అయితే.. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్టు ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. పక్కనున్న ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాగా.. అక్కడ కూడా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.దామోదర నాయుడు వెల్లడించారు. అయితే.. బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ జరిగిన తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, కృష్ణా జిల్లా బాదంపూడి, కర్నూలు జిల్లా ఎన్‌.ఆర్‌.పేట, ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.


అయితే.. బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే. ఇది పక్షుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దీన్ని నివారించేందుకు గానూ.. కోడి మాంసాన్ని సరిగ్గా ఉడికించుకుని తింటే సరిపోతుందని వైద్యులు చెప్తున్నారు. కోడి మాంసాన్ని కనీసం 165 డిగ్రీల ఫారెన్‌హీట్ (74 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలని చెప్తున్నారు. మాంసాన్ని బాగా ఉడికించడం వల్ల వైరస్ నశించిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక సగం ఉడికించిన మాంసాన్ని గానీ, ప్రాసెస్ట్ ఫుడ్ కానీ తినకుండా ఉంటే చాలని వైద్యులు చెప్తున్నారు.


అయితే.. పచ్చి కోడి మాంసాన్ని తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కోడి మాంసంతో ఉపయోగించిన పాత్రలను వేడి నీటితో శుభ్రంగా కడగాలి. కోడి గుడ్లను కూడా బాగా ఉడికించిన తర్వాతే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. హాఫ్ బాయిల్స్ లాంటివి తినకపోవటమే మంచిదంటున్నారు. మరోవైపు.. బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తులకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa