తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో పర్యటిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి.. అప్పకపల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మహిళలకు శుభవార్త వినిపించారు. గత ప్రభుత్వం మహిళా సంఘాల్ని పట్టించుకోలేదని.. ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం మహిళా సంఘాల్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోందని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా.. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో మామూలు చీరలు ఇచ్చేవారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఖరీదైన చీరలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు.. అంబానీ, అదానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్టుల్లో మహిళలను ప్రోత్సహిస్తామని చెప్పుకొచ్చారు. మహిళలు వ్యాపారంలో వేగంగా ఎదిగేలా వారిని ప్రోత్సహిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని తమ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామన్నారు.
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యన్నారు. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. ఈ క్రమంలోనే.. 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని తెలిపారు. ఇదే క్రమంలో.. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు.
త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు ఖరీదైన చీరలు కానుకగా ఇవ్వనున్నామని రేవంత్ రెడ్డి కీలక ప్రకటించారు. సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నామని తెలిపారు. రూరల్, అర్బన్ అనే తేడా లేదని... తెలంగాణలో మహిళలంతా ఒక్కటేనని.. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందామన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీ డీకే అరుణ సహకరించాలని కోరుతున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. నిధులు తాము ఇస్తామని.. నిర్వహణ మీరు చేయండని కోరారు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో.. బడులను కూడా అలాగే నిర్వహించుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa