ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 08:33 PM

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ-ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం గురించి.. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు.. పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల్లో టన్నెల్స్‌ నిర్మించే నిపుణులను.. ఇక గతంలో ఎక్కడ టన్నెల్‌ ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ టీమ్‌ను తీసుకొచ్చి.. లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చేలా సాయం తీసుకుంటున్నామని తెలిపారు.


ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న టీబీఎంను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి వేరు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ పూడికలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. అక్కడ మట్టి, నీరుతో పేరుకుపోయిన సిల్ట్‌ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచనలతో ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొ్న్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడటమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని తెలిపారు.


దేశ సరిహద్దులో టన్నెల్ నిర్మించిన టీబీఎం నిపుణులను టన్నెల్ లోపలికి పంపించి.. రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసినట్లు చెప్పారు. 200 మీటర్ల వరకు మట్టి, నీరు కలిసి.. బురద రూపంలో పేరుకుపోయిందని తెలిపారు. ఈ బురద పేరుకుపోవడంతో కొంతమేర రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. టన్నెల్‌లో పూర్తి స్థాయిలో నీటిని తోడేసి.. టన్నెల్ బోరింగ్ మిషన్‌ను గ్యాస్ కట్టర్‌తో తీసివేయాలని చెప్పినట్లు తెలిపారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, రాట్ హోల్ మైనింగ్ సిబ్బంది సహకారంతో సిల్ట్‌లోకి వెళ్లి గల్లంతైన 8 కార్మికుల ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన 3 గంటల్లోనే తాను ఘటనాస్థలికి చేరుకున్నానని.. అప్పటి నుంచి ఇప్పటివరకు దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.


ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న విమర్శలను మంత్రి ఉత్తమ్ కొట్టిపారేశారు. ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేసి.. విపక్షాలు లబ్ధిపొందాలనుకుంటున్నాయని.. అలాంటి వారి గురించి తాను మాట్లాడదల్చుకోలేదని తేల్చి చెప్పేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa