ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో నీటి కటకట.. ఆ ప్రాంతాల్లో 30 గంటలుగా నో వాటర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 05:54 PM

హైదరాబాద్‌లో నీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవికాలం పూర్తిగా రాకముందే నగరంలో వాటర్ ప్రాబ్లమ్ ప్రారంభమైంది. ఇప్పటికే.. రోడ్లపై ట్యాంకర్ల హడావుడి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే.. పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బీహెచ్ఈఎస్ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 30 గంటలుగా నీటి సరఫరా ఆగిపోయింది. బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర పీఎస్సీ పైప్ లైన్ రిపేర్ కారణంగా శనివారం (మార్చి 08న) పలు ప్రాంతాలకు అధికారులు నీటి సరఫరా నిలివేశారు. 12గంటల్లో పనులు పూర్తి చేస్తామని NHAI అధికారులు చెప్పటంతో.. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ప్రకటించింది.


అయితే.. శనివారం సాయంత్రం 06 గంటలకు నీటి సరఫరాను పునరుద్దరించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు కూడా తిరిగి ప్రారంభించకపోవటం గమనార్హం. 12 గంటలు అన్న అధికారులు.. 30 గంటలు గడిచిపోయినా కూడా పైప్ లైన్ పనులు పూర్తి కాకపోవడంతో.. నీటి సరఫరాను అధికారులు ప్రారంభించలేదు. దీంతో NHAI తీరుపై జలమండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 12 గంటలు అని చెప్పి 30 గంటలైనా పనులు పూర్తి చేయరా అంటూ జలమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది.


30 గంటలుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో.. ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తి శ్రీ నగర్, బీరంగూడ, అమీన్ పూర్, నిజాంపేట్ ప్రాంతాల్లోని స్థానికులు.. మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


అందులోనూ వీకెండ్ కావటంతో.. కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటే.. నీటి సరఫరా లేకపోవటంతో.. ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో నీళ్లు రాక.. బయటికి వెళ్లలేక.. సెలవుదినం రోజు చిరగ్గా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa