నిమ్స్ వైద్యులు అద్భుతం చేశారు. తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న 19 ఏళ్ల యువకునికి అరుదైన ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన మరో యువకుడి గుండెను తీసి.. 19 ఏళ్ల యువకుడికి విజయవంతంగా ట్రాన్స్ప్లాంట్ చేసి పునర్జన్మనిచ్చారు. అది కూడా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స అందించటం గమనార్హం. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్వోడీ డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ టెక్నీషియన్ల బృందం శుక్రవారం (మార్చి 07న) ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయగా.. ప్రస్తుతం యువకుడు కోలుకుంటున్నాడు.
హైదరాబాద్లోని రసూల్పురాకు చెందిన అనిల్ కుమార్ కొంత కాలంగా తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రులు తిరిగిన సమస్య పరిష్కారం కాలేదు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయటమే ఏకైక మార్గమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో.. నిమ్స్ ఆసుపత్రిలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం జీవన్దాన్లో రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే.. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాపడగా.. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (మార్చి 07న) బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో.. అక్కడి వైద్యులు అవయవదానం గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా.. గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ యువకుని బ్లడ్ గ్రూపునకు, అనిల్కుమార్ బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అవటంతో.. గుండెను నిమ్స్ ఆసుపత్రికి తరలించి, డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని బృందం అనిల్ కుమార్కు అమర్చింది.
ఆరోగ్యశ్రీ కింద అనిల్ కుమార్కు ఉచితంగా అవయవ మార్పిడి చికిత్స చేశామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప వివరించారు. నిమ్స్లో గతేడాది విజయవంతంగా 62 మందికి కిడ్నీ, నలుగురికి లివర్, ఇద్దరికి హార్ట్, ఒకరికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసినట్టు చెప్పుకొచ్చారు, ఈ ఏడాది 16 మందికి కిడ్నీ, ఒకిరికి లివర్, ఒకరికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేశామన్నారు. 2024, 2025లో కలిపి మొత్తం 87 ట్రాన్స్ప్లాంటేషన్లు చేసినట్లు తెలిపారు. గతేడాది నిమ్స్లో ఒక వ్యక్తికి హార్ట్, లంగ్ రెండూ ఒకేసారి ట్రాన్స్ప్లాంట్ చేశామని బీరప్ప తెలిపారు. దేశంలోని ప్రభుత్వ దవాఖాన్లలో, ఒక్క నిమ్స్లో మాత్రమే ఇలా ఒకేసారి హార్ట్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా.. విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. అటు గుండెను దానం చేసిన కుటుంబ సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే.. అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa