ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతన్నలకు ఒక్కొక్కరికి రూ. లక్ష రుణమాఫీ.. నిధులు విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 05:47 PM

తెలంగాణలోని నేతన్నలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. ఇప్పటికే రైతన్నలకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్నల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేతన్నలకు సంబంధించిన రుణమాఫీ జీవోను సర్కార్ విడుదల చేసింది. ఇందులో భాగంగా.. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు రుణాలు తీసుకున్న చేనేత కార్మికులందరికి ఇది వర్తించనుంది. కాగా.. ఈమేరకు రూ.33 కోట్లు రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది.


ఇదిలా ఉంటే.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పద్మశాలీలపై వరాలు కురిపించారు. పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకూ అంతే ప్రాముఖ్యత ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయంతో పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.


పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదు, త్యాగంలోనూ ముందుటారని కొనియాడిన రేవంత్ రెడ్డి.. పద్మశాలీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. టైగర్ నరేంద్ర త్యాగం లేకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది నిజమని చెప్పుకొచ్చారు. ఆలె నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేస్తే.. కేసీఆర్ అనే ధృతరాష్ట్రుడు ఆయన పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేసుకోవడమే కాకుండా ఆయనను ఖతం చేసిన కథ పద్మశాలీలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు.


మరోవైపు.. బీఆర్ఎస్ పెట్టినప్పుడు నీడ కల్పించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి.. కేసీఆర్ నిలువ నీడ లేకుండా చేశారని.. ఆయన చనిపోతే కనీసం చూడటానికి కూడా వెళ్లలేదని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ లేదని.. గత ప్రభుత్వం ఆ ప్రయత్నమూ చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఐఐహెచ్‌టీ సాధించడమే కాకుండా దానికి కొండా లక్ష్మణ బాపూజీ పేరు పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదర్శమూర్తిగా నిలిచిన లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి పెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.


మహారాష్ట్రలోని షోలాపూర్‌లో తెలంగాణకు చెందిన పద్మశాలీలు చాలా మంది ఉన్నారని.. అక్కడ పద్మశాలీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మాణానికి కోటి రూపాయలు ఇచ్చి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నాసిరకమైన బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. తాము వచ్చాక ఆ ఆర్డర్లను రద్దు చేస్తే నేతన్నలు ఇబ్బందులు పడతారని టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. దాంతో ఈ రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇచ్చేలా ఒక కోటి 30 లక్షల చీరలు పద్మశాలీలకు ఆర్డర్ ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa