ట్రెండింగ్
Epaper    English    தமிழ்

19న బడ్జెట్,,,,,27 వరకు అసెంబ్లీ సమావేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 05:56 PM

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు మార్చి 27వ తేదీ వరకు కొనసాగించాలని బీఏసీ నిర్ణయించింది. ఈరోజు (మార్చి 12న)న అసెంబ్లీ సమావేశాలు మొదలవగా.. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం నిర్వహించారు. మంత్రులతో పాటు విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీఏసీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు వీలైనన్ని ఎక్కువ రోజులు సభ నిర్వహించాలని విపక్షాలు కోరగా.. మార్చి 27వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.


14న హోలీ, 16న ఆదివారం, 20, 23న సెలవులు ఉండటంతో.. ఈ నాలుగు రోజులు మినహాయించి మొత్తంగా 12 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో 15 నుంచి 18 వరకు కులగణనపై చర్చ జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును 15వ తేదీన ప్రవేశపెట్టబోతోంది. 17, 18వ తేదీల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.


మరోవైపు.. మార్చి 19వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 20వ తేదీన సెలవు కావటంతో.. 21, 22వ తేదీల్లో బడ్జెట్ మీద చర్చించనున్నారు. 24, 25, 26వ తేదీల్లో పద్దులపై చర్చలు జరుపుతారు. చివరగా 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.


అయితే.. సభలో కృష్ణా జలాల హక్కు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, రైతుభరోసా, స్థానిక సంస్థల నిధుల లేమి వంటి ప్రధాన అంశాలపై కూడా అసెంబ్లీ చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్‌లో ఆమోదం పొందేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో.. ఈ సమావేశాలు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa