ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 06:00 PM

ఓ వైపు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ సింబల్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ జనవరి 15న‌‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల‌పై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌‌‌‌ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్‌‌‌‌ లీవ్‌‌‌‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌‌‌‌ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్‌‌‌‌ రెడ్డి, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఎం.సంజయ్‌‌‌‌కుమార్, కాలె యాదయ్యలపై కేటీఆర్ రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. అయితే, అన్ని పిటిషన్లను ఒకే దగ్గర కలిపి సుప్రీం ధర్మాసనం విచారణ చేపడుతోంది.


నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మరోసారి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు ఇచ్చింది. తాజాగా పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. నోటీసులు అందుకున్న కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ నెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.


నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో అన్నారు. రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశామని.. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. సంక్షేమం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇక ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మార్చి 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు పని విభజన చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇరిగేషన్, వ్యవసాయం, రెవెన్యూ, పవర్, వైద్యంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa