ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 02:27 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా  భూత్పూర్‌ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీకొన్నాయి.దీంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. శుక్రవారం రాత్రి శ్రీ ఆంజనేయ, సీఎంఆర్‌, టీవీకే ట్రావెల్స్‌ బస్సులు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాయి. మూడు బస్సులు అతివేగంగా ఒకదాని వెనుక ఒకటి వస్తున్నాయి. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని షేర్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ డ్రైవర్‌ ఆకస్మికంగా బ్రేక్‌ వేశాడు. దాని వెనుక బస్సు డ్రైవర్‌ కూడా బ్రేక్‌ వేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే అతివేగంగా వస్తున్న బస్సులు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా బస్సుల్లో ఉన్న ప్రయాణికులు కేకలు పెడుతూ భయాందోళనలకు గురయ్యారు. పలువురు గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సులను పక్కకు తీయించారు. ప్రమాద సమయంలో మూడు బస్సుల్లో 98 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ప్రమాదం కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో.. వాటిని క్లియర్‌ చేశారు. కాగా, బస్సులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించాలమని చెప్పగా.. తాము ప్రయాణికులను హైదరాబాద్‌లో వదిలి వస్తామని చెప్పి డ్రైవర్లు బస్సులతో అక్కడిని బయల్దేరారు. కాగా, ప్రమాదానికి గురైన బస్సుల్లో ప్రయాణికులను తరలించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ డ్రైవర్లు దానిని పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంతోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా బస్సులు నడిపిన డ్రైవర్లు, వారి యజమానుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa