ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 05:43 PM

సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కేంద్రం ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ.5 లక్షల సాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా.. స్థలం ఉన్న వారి జాబితాలను ఇప్పటికే నియోజకవర్గాల వెల్లడించారు. అయితే పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి లక్ష ఇండ్లు మంజూరు చేసేందుకు తాజాగా కేంద్రం అంగీకరించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగానూ పట్టణ ప్రాంతాల్లో ఈ ఇండ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపింది. పీఎం ఆవాస్ వెబ్సైట్ లో లక్ష ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఇప్పటికే అప్‌లోడ్ చేసింది.


స్టేట్ హౌసింగ్ ఆఫీసర్లు ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి అర్బన్, రూరల్ కేటగిరీలో ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో ఈ ఇండ్ల మంజూరుకు అంగీకరించిన కేంద్రం.. రూరల్ ఇండ్లకు మాత్రం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.


ఇదిలా ఉంటే.. 100 శాతం సబ్సిడీతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇచ్చేలా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న రూరల్ ఏరియాలో 71,500 ఇండ్లను సాంక్షన్ చేసి.. లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను కూడా అందించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ ఇండ్ల నిర్మాణాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే కేంద్రం అందిస్తున్న పీఎం ఆవాస్ యోజన పథకం కింద.. అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, రూరల్ ఏరియాల్లో రూ.72 వేలు ఇస్తుంది. ఈ రకంగా చూసుకుంటే.. రాష్ట్రానికి మొత్తం రూ.1500 కోట్లు రానున్నాయి. దీంతో ప్రభుత్వం పేదలకు నిర్మిస్తామని చెప్పిన లక్ష ఇండ్లకు మిగతా రూ.3.50 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.


కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఇండ్లు ఇవ్వాలని మొదటి నుంచి కోరుతోంది. గత సంవత్సరం పట్టణం, రూరల్ ఏరియాలకు కలిపి మొత్తం 9 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. ప్రధాని మోదీని ఇటీవల ఢిల్లీ వెళ్లిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు.


ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కలిసి.. తమ రాష్ట్రానికి ఎక్కువ ఇండ్లను కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లపైన పీఎం ఆవాస్ యోజన లోగో కూడా వేస్తామని గతంలో సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ రకంగా రాష్ట్రానికి వచ్చే నాలుగు ఏండ్లలో ఎక్కువ సంఖ్యలో ఇండ్లను మంజూరు చేయించుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.


ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత.. .


తొలి విడతలో తెలంగాణ ప్రభుత్వం 71,500 ఇండ్లను మంజూరు చేయగా.. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇలా నియోజకవర్గానికి చాలా తక్కువ సంఖ్యలో ఇండ్లు మంజూరు కావడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ సారి ప్రతీ మండలంలో లబ్ధిదారులు ఉండే విధంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక సాగుతోంది. ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తామన్న హామీలో సాధ్యమైనంత వరకు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa