తెలంగాణలో త్వరలోనే ఉపఎన్నికలు రానున్నాయంటూ గత కొంతకాలంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ ఉపఎన్నికలపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన పలు అంశాలపై స్పందిస్తూ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉపఎన్నికల విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఉపఎన్నికల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరినా, వెనక్కి వెళ్లినా ఉపఎన్నికలు రావని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిపైనే తాను దృష్టి పెట్టానని, ఇలాంటి విషయాలపై కాదని రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఏదైనా జరుగుతుందని.. ఏం జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం (మార్చి 26న) రోజున అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. "సభ్యులు ఎవరూ ఆలోచించి ఆందోళన చెందాల్సిన పని లేదు." అని తెలిపారు. ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం మంచిదని రేవంత్ రెడ్డి సూచించారు.
ఇతర పార్టీల నేతలు తమతో చేరినా, చేరిన వాళ్లు వెనక్కి వెళ్లినా ఉపఎన్నికలు రావని ఖరాఖండిగా చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిపైనే తాను దృష్టి పెట్టానని, ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టి సమయం వృథా చేసుకోనని చెప్పుకొచ్చారు. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున తీర్పు వచ్చాక ఏదైతే అది అవుతుందని.. అన్నిటికీ తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారిన విషయం తెలిసిందే. కాగా.. ఆ 10 మంది మీద అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించగా.. స్పీకర్ నిర్ణయానికి వదిలేసింది. దీంతో.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుండగా.. అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వారంతా రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తారని రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa