తెలంగాణలో సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ భూములపై తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తుండగా.. ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూమి అంశంపై స్పష్టత తీసుకురావటానికి ప్రభుత్వం మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ త్రిసభ్య కమిటీ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరుపనుంది. ఈ సంప్రదింపుల ద్వారా.. విద్యార్థులు, ప్రజాసంఘాలు, ప్రజలకు ప్రభుత్వం లక్ష్యాలు, విధానాలు తెలియజేయటమే కాకుండా.. వాటిపై వచ్చే అభిప్రాయాలు తీసుకుని ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వివాదాన్ని పుల్ స్టాప్ పెట్టాలని సర్కార్ యోచిస్తోంది.
అయితే.. ఈ 400 ఎకరాల భూమిని గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారని విద్యార్థులు, పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. కానీ.. ఆ భూములు ప్రభుత్వ స్థలాలుగా చెప్పుతూ.. వాటిని ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలని చూస్తోందని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.
మరోవైపు.. రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం.. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివేనని, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది. అక్కడ అడవి కూడా లేదంటూ చెప్తోంది. ఈ స్థలాల్లో అభివృద్ధి పనుల ద్వారా రూ. 50,000 కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఈ ప్రదేశాన్ని టెక్ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మంత్రులు ఇటీవల మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అభివృద్ధికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని, టెక్ సిటీ ప్రాజెక్ట్ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అయితే.. ఈ భూమి వివాదంపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా.. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వందల ఎకరాల్లో ఉన్న చెట్లు నరికి వేయడం చిన్న విషయం కాదని, ఇది తీవ్రమైన అంశమని పేర్కొంది. ప్రభుత్వం చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటుందని ప్రశ్నించింది. తక్షణమే చెట్ల నరికివేతను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. అదనంగా, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను భూమి పరిశీలన చేయించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ భూమి వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అభివృద్ధిని కోరుకుంటోందా? లేక ఈ భూమిపై ఉన్న ఇతర హక్కులను పట్టించుకోవడం లేదా? అనేది త్వరలో స్పష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa