తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్న శ్రీరామనవమి తరువాత రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త ఉంటుందని ప్రకటించారు. తెలంగాణలోని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రభుత్వం లాంచనంగా ప్రారంభించింది. లబ్దిదారులకు సంబంధించి జాబితాలు కూడా ప్రకటించింది. ఈ మేరకు.. ఫిబ్రవరి 21, 2025న నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కింద 72,045 గృహాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు శ్రీరామనవమి కానుక అందజేయనున్నట్టు తెలిపారు. శ్రీరామనవమి తరువాత నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి ప్రకటించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు నిజమైన బహుమతి అని చెప్పారు. గత పాలకులు పేదల కోసం ఎటువంటి గృహ నిర్మాణం చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు. దిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు సొంత గృహాలు అందించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకత కోసం ఆధునిక టెక్నాలజీని వినియోగించి, నిజమైన పేదలకు గృహ సౌకర్యం అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహాల నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్లు వెల్లడించారు. మొత్తం 10 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.20,609 కోట్లు రైతుల రుణమాఫీ కింద విడుదల చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో తరుగు (తక్కువ బరువు) పెడితే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించకూడదని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయంగా ఉండాలని ఆదేశించారు. ఇందిరమ్మ పాలనలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa