ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డికి,,షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 08:48 PM

చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి 7న దాడి జరిగింది. 'రామరాజ్యం' అనే సంస్థకు చెందిన వీర రాఘవరెడ్డి నేతృత్వంలోని సుమారు 20 మంది సభ్యులు నల్లని దుస్తులు ధరించి రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామరాజ్యం స్థాపనకు మద్దతుగా ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ ఈ డిమాండ్లను తిరస్కరించడంతో దాడి చేశారు. ఈ దాడిలో రంగరాజన్‌కు గాయాలయ్యాయి. ఆయన కుమారుడు కూడా గాయపడ్డారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.


ఈ ఘటనపై రంగరాజన్ కుటుంబ సభ్యులు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రంగరాజన్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. దాడి చేసినవారు తమను తాము ఇక్ష్వాకు వంశస్థులుగా చెప్పుకుంటూ.. 'రామరాజ్యం' స్థాపన కోసం పనిచేస్తున్నామని, ఆలయ బాధ్యతలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో.. వారు కోపంతో దాడి చేశారు. రంగరాజన్ ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని ఫిబ్రవరి 8న అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో 14 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు.


ఈ దాడిని తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగరాజన్‌ను ఫోన్‌లో పరామర్శించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి కేటీఆర్ వంటి వారు కూడా ఈ దాడిని ఖండించారు. కేటీఆర్ స్వయంగా రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఫోన్‌లో ఆయన్ను పరామర్శించారు. హిందూ సంఘాలు, భక్తులు దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన తర్వాత ఆలయం వద్ద, రంగరాజన్ ఇంటి సమీపంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజాగా ప్రధాన నిందితుడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa