హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణ పరిరక్షకులు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దుతుగా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీంతో.. ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో.. 400 ఎకరాల్లోని చెట్లను నరికివేయటం, ఆ ప్రాంతంలోని వన్యప్రాణులు మరణించడానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు వాటిని తమ అకౌంట్లలో షేర్ చేశారు. ఇదే క్రమంలో.. బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. "ప్రకృతిని రక్షించండి, జీవవైవిధ్యాన్ని కాపాడండి.." అనే మెస్సేజ్తో కంచ గచ్చిబౌలి భూములపై పలు వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అయితే.. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా తయారైన ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్నారని.. కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వాటిని షేర్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏఐ ఫేక్ వీడియోలు ఇలాగే ప్రచారమయితే భవిష్యత్తులో పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై దియా మీర్జా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని.. దియామీర్జా ఆరోపించారు. తాను ఏఐ ద్వారా తయారు చేసిన ఏ ఒక్క ఫొటో గానీ, వీడియో గానీ పోస్ట్ చేయలేదని దియామీర్జా స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు దియామీర్జా.
"తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. కంచ గచ్చిబౌలి పరిస్థితి గురించి ఆయన కొన్ని వాదనలు చేశారు. వాటిలో ఒకటి.. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమిపై జీవవైవిధ్యాన్ని కాపాడాలని విద్యార్థులు చేసిన నిరసనకు మద్దతుగా నేను నకిలీ AI రూపొందించిన చిత్రాలు/వీడియోలను ఉపయోగించాను అని. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. AI రూపొందించిన ఒక్క చిత్రం లేదా వీడియోను నేను పోస్ట్ చేయలేదు. మీడియా, తెలంగాణ ప్రభుత్వం అటువంటి వాదనలు చేసే ముందు వారి వాస్తవాలను ధృవీకరించుకోవాలి." అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు దియామీర్జా.
దియా మీర్జా స్పందనతో కంచ గచ్చిబౌలి భూముల వివాదం మరింత వేడి రాజుకున్నట్టయింది. ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు, రాజకీయ నాయకులంతా ఈ భూముల పరిరక్షణపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. మరి ఇలాంటి పరిణామాలతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది.. ఈ వివాదానికి ఎలాంటి పరిష్కారం చూపెట్టనుందన్నది వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa