తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం (ఏప్రిల్ 15) రోజున హైదరాబాద్లోని శంషాబాద్ నోవాటెల్ హోటల్ వేదికగా జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.. హస్తం ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ పలువురు నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడితే.. ఆ తర్వాత వాళ్లే ఇబ్బందులు ఎదుర్కొంటారని వార్నింగ్ ఇచ్చింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే.. లాభం కంటే నష్టమే ఎక్కువ అని వివరించారు.
ఇదే క్రమంలో.. పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25,000 విరాళం తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, రాబోయే ఎన్నికల సన్నాహాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ విరాళాలను వినియోగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హస్తం నేతలందరి లక్ష్యం ఒక్కటే అయ్యి ఉండాలని.. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.
మరోవైపు.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా కృషి చేయాలని, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, పార్టీ క్రమశిక్షణను కాపాడటం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. రేపటి (ఏప్రిల్ 16) నుంచి ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించాలని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సూచించారు. తాను కూడా మే ఒకటో తారీఖు నుంచి జనాల్లోకి వెళ్తానని తెలిపారు. నిన్న, మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్రెడ్డి మాత్రమే తమపై విమర్శలు చేశారని.. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. మంత్రి వర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణపై, మంత్రి పదవులపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. మంత్రి పదవులపై ఒకరికి మించి మరొకరు లీకులు ఇస్తున్నారంటూ పలువురు నేతలకు ప్రత్యేకంగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు సమాచారం. "రోజుకొకరిని నువ్వే మంత్రిగా ప్రకటిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుంది. మరోసారి ఈ అంశంపై మాట్లాడొద్దు. నేతలు, కార్యకర్తలను అయోమయానికి గురి చేయొద్దు." అంటూ చామలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలు, సూచనలు.. ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa